TTD EO Shyamala Rao: ప్రణాళికబద్ధంగా తిరుమల అభివృద్ధి
ABN , Publish Date - May 25 , 2025 | 04:14 AM
తిరుమల అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా కొనసాగిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టౌన్ప్లానింగ్ విభాగం ఏర్పాటు చేసి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమల, మే24(ఆంధ్రజ్యోతి): తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో భవనాలు, రోడ్లు వంటి ఏ నిర్మాణాలు చేపట్టినా టౌన్ప్లానింగ్ ప్రకారమే జరగాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీటీడీలో టౌన్ప్లానింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి కూడా వచ్చిందని, త్వరలో డైరెక్టర్, డిప్యూటీ సిటీప్లానర్, అసోసియేట్ ప్లానర్ వంటి ఆరు పోస్టులను భర్తీ చేస్తామన్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీల ద్వారా టీటీడీలోని అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గోమాతసేవను ప్రారంభిస్తామని, తిరుమలలోని బిగ్, జనతా క్యాంటీన్లను బ్రాండెడ్ సంస్థలకు కేటాయించేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. వాట్సాప్ ఇ-గవర్నెన్స్లో ఇప్పటికే 14 టీటీడీ సేవలను జత చేశామని ఈవో తెలిపారు.
చెన్నైవాసిని నమాజ్ చేసేందుకు కొందరు ప్రోత్సహించారు
తిరుమలలో నమాజ్ చేసేందుకు అన్యమతానికి చెందిన వ్యక్తిని కొందరు ప్రోత్సహించినట్టు పోలీసుల విచారణలో తెలిసిందని ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఎండోమెంట్ యాక్ట్ప్రకారం ఇలాంటివి చేయకూడదనే నిబంధన ఉందన్నారు. దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. అన్యమతానికి చెందిన ఆ వ్యక్తిని కొందరు మిస్లీడ్ చేశారని, నమాజ్ చేస్తుండగా వీడియో తీసి దానిద్వారా లబ్ధి పొందవచ్చని అలా వ్యవహరించారన్నారు. వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల వ్యవహరంపై స్పందిస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అలిపిరిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. అలిపిరి చెక్పాయింట్లో ఎప్పుడో ఏర్పాటు చేసిన స్కానర్లు, కంప్యూటర్లు ఉన్నాయని, వాటిని మార్చడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ఆరోగ్యవరప్రసాదినికి రూ.10 లక్షల విరాళం
టీటీడీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందాయి. బెంగళూరుకు చెందిన అలెన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ యాదవ్ ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో శుక్రవారం ఉదయం నుంచే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. శనివారం కూడా అదే తరహాలో తిరుమల క్షేత్రంలో రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కిలోమీటరు మేర శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.