Share News

Thopudurthi Bail: హెలిప్యాడ్‌ కేసులో అజ్ఞాతంలోకి తోపుదుర్తి

ABN , Publish Date - May 02 , 2025 | 05:29 AM

అజ్ఞాతంలో ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించారు. కేసు వివరాలు సమర్పించాలని పోలీసులు, తదుపరి విచారణ మే 5కు వాయిదా వేసింది

Thopudurthi Bail: హెలిప్యాడ్‌ కేసులో అజ్ఞాతంలోకి తోపుదుర్తి

  • రామగిరి పోలీసుల గాలింపు.. మొబైల్‌ ఫోన్‌ స్విచాఫ్‌

  • ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే

పుట్టపర్తి/అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత నెల 8వ తేదీన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది హెలిప్యాడ్‌ వద్ద వైసీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ దెబ్బతిందంటూ.. జగన్‌ను తిరిగి తీసుకెళ్లకుండానే హెలికాప్టర్‌ బెంగళూరు వెళ్లిపోవడం వివాదాస్పదమైంది. విండ్‌షీల్డ్‌ దెబ్బతిన్నా హెలికాప్టర్‌ ఎలా ఎగరగలిగిందన్నది సందేహంగా మారింది. నాటి వైసీపీ శ్రేణుల అరాచకంలో గాయపడిన పుట్టపర్తి రూరల్‌ పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ నరేంద్రకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మరికొందరిపై గత నెల 10వ తేదీన కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఆయనకు నోటీసులిచ్చేందుకు సీఐ శ్రీధర్‌ సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి తోపుదుర్తి ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులను ఆరా తీశారు. తమకు తెలియదని వారు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఆయన మొబైల్‌కు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఆయన కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. హెలిప్యాడ్‌ ఘటనపై ఇప్పటికే కో-పైలట్‌ను విచారించారు. పైలట్‌ అనిల్‌కుమార్‌కు రెండో నోటీసు ఇచ్చి శుక్రవారం రావాలని సూచించారు. అయితే మరికొంత సమయం కావాలని ఆయన కోరినట్లు తెలిసింది.


హైకోర్టుకు తోపుదుర్తి

ఇంకోవైపు.. అజ్ఞాతంలో ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి.. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆదేశించారు. ఆయనపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలు తమ ముందుంచాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారాని(5వ తేదీ)కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులిచ్చారు. తోపుదుర్తి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేసులోని ఇతర నిందితులకు 41ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రాసిక్యూషన్‌ కోర్టుకు నివేదించిందని.. అయితే పోలీసులు తోపుదుర్తిని అరెస్టు చేసేందుకు నివాసానికి వెళ్లారని తెలిపారు.

Updated Date - May 02 , 2025 | 05:29 AM