Share News

Telugu Engineer Madhaveelatha: చినాబ్‌పై తెలుగు ముద్ర..

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:15 AM

భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన చినాబ్‌ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగుతేజం మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని (ఐఐఎస్‌సీ)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Telugu Engineer Madhaveelatha: చినాబ్‌పై తెలుగు ముద్ర..

  • రైల్వే వంతెన నిర్మాణంలో తెలుగమ్మాయి కీలక పాత్ర

  • టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా ప్రకాశం వాసి మాధవీలత బాధ్యతలు

ఒంగోలు కార్పొరేషన్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన చినాబ్‌ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగుతేజం మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని (ఐఐఎస్‌సీ)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కందుకూరులోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చదువుకున్న మాధవీలత జేఎన్‌టీయూ కాకినాడలో ఇంజనీరింగ్‌, వరంగల్‌ నిట్‌లో ఎంటెక్‌ పూర్తి చేశారు. మద్రాస్‌ ఐఐటీలో పీహెచ్‌డీ పూర్తిచేసి ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎ్‌ససీ)లో రాక్‌ మెకానిక్స్‌లో పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలోషిప్‌ చేశారు. గువాహటీ ఐఐటీలో ఏడాదిపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎ్‌ససీలో హెచ్‌ఏజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ టెక్నాలజీస్‌ విభాగానికి చైర్‌పర్సన్‌గా అనేక ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఈ క్రమంలో చినాబ్‌ వంతెన నిర్మాణ బాధ్యతను నార్తర్న్‌ రైల్వే ఆఫ్కాన్స్‌ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థకు జియో టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా ఉండటంతో.. రాక్‌ మెకానిక్స్‌లో అనుభవం ఉన్న మాధవీలతకు ఈ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం దక్కింది. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఈ బాధ్యతలన్నీ విజయవంతంగా పూర్తిచేసిన ఘనత మాధవీలతకు, ఆమె బృందానికి దక్కింది. ఈ నేపథ్యంలో మాధవీలత ప్రతిభను ఏడుగుండ్లపాడు వాసులు ఘనంగా చెప్పుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబ నేపథ్యం

ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన ప్రొఫెసర్‌ మాధవీలత బాల్యమంతా గ్రామంలోనే కొనసాగింది. తండ్రి గాలి వెంకారెడ్డి, తల్లి అన్నపూర్ణమ్మ. మాధవీలత భర్త హరిప్రసాద్‌ రెడ్డి గూగుల్‌లో పనిచేస్తున్నారు. మాధవీలత, హరిప్రసాద్‌ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 04:17 AM