Share News

Supreme Court: మీ పోస్టులు శ్రుతిమించాయ్‌

ABN , Publish Date - May 24 , 2025 | 03:40 AM

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై సజ్జల భార్గవ్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ, రెండు వారాల మధ్యంతర రక్షణతో పిటిషన్‌ను కొట్టివేసింది.

Supreme Court: మీ పోస్టులు  శ్రుతిమించాయ్‌

  • అవి మాకు అర్థం కాలేదనుకున్నారా?

  • ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకోలేమా?

  • సజ్జల భార్గవ్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • అసభ్య పోస్టులను వ్యవస్థ క్షమించదు

  • తప్పకుండా శిక్షిస్తుంది

  • సోషల్‌ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్‌ వస్తుందనుకోవద్దు

  • సులభంగా దొరికితే ఇలాంటివారిని నియంత్రించలేం: ధర్మాసనం

  • ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత.. రెండువారాల పాటు మధ్యంతర రక్షణ

  • రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ఎస్సీ, ఎస్టీ కోర్టుకు వెళ్లాలని సూచన

న్యూఢిల్లీ, మే 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పెట్టిన పోస్టులపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. అవి శ్రుతిమించాయని.. భరించరాని స్థాయికి వెళ్లాయని స్పష్టంచేసింది. ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో అర్థం చేసుకోలేమా అని నిలదీసింది. ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. 2023లో టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగలపై అనుచిత పోస్టులు పెట్టారని.. అవి తీసివేయాలని అడిగినందుకు తనను చంపుతానని బెదిరించి.. కులం పేరుతో తనను, అనితను దూషించారని కడప జిల్లా పులివెందులలో కొండప్పగారి హరి అనే దళితుడి ఫిర్యాదు మేరకు గతేడాది నవంబరులో సజ్జల భార్గవ్‌రెడ్డి, జగన్‌కు వరుసకు మేనల్లుడయ్యే సింగారెడ్డి అర్జున్‌రెడ్డి, వైసీపీ సోషల్‌ మీడియాకు చెందిన వర్రా రవీందర్‌రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసులో బెయిల్‌ కోరుతూ భార్గవ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా నిరాశే ఎదురైంది. దీంతో ఈ నెల 13న ఆయన సుప్రీంకోర్టును ఆశయ్రించారు. ఆ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. భార్గవ్‌రెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపించారు. ఇది రాజకీయ దురుద్దేశంలో పెట్టిన కేసన్నారు. 2021లో ఘటన జరిగితే ఉద్దేశపూర్వకంగానే నాలుగేళ్ల తర్వాత విచారణ చేపట్టారని.. భార్గవ్‌రెడ్డి వేరేవాళ్లు చెప్పిన అంశాలను మాత్రమే పోస్టు చేశారని తెలిపారు.


అయితే ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల దుర్వినియోగం ఎక్కువైపోయిందని.. ఇలాంటి కేసుల్లో బెయిల్‌ సులభంగా దొరికితే.. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసే వారిని నియంత్రించలేమని అభిప్రాయ పడింది. ఇది రాజకీయాలతో కూడిన అంశమని, కేసు పూర్తిగా అక్రమమని, దీనికి సంబంధించి మరిన్ని వివరాలను న్యాయస్థానం ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని దవే మరోసారి వాదనలు వినిపించేందుకు ప్రయత్నించడంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘మీరు ఎటువంటి పోస్టులు పెట్టారో మాకు తెలియదని అనుకుంటున్నారా? సోషల్‌ మీడియాలో మీ పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా? ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? మీ పోస్టులు శ్రుతిమించాయి. భరించరాని స్థాయికి వెళ్లాయి. ఇది రాజకీయమా.. మరొకటా అనేది మాకు అనవసరం. ఇలాంటి అంశాల్లో రాజకీయాలు అప్రస్తుతం. మీరు పెట్టిన పోస్టుల గురించి మాత్రమే మేం మాట్లాడుతున్నాం. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదు. తప్పక శిక్షిస్తుంది. సోషల్‌ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్‌ వస్తుందనుకోవద్దు. అలా బెయిల్‌ వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారు. ఇటువంటి చర్యలు మేమెప్పటికీ క్షమించం’ అని తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ, ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రెండు వారాలు మధ్యంతర రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపింది. కోర్టులకు వేసవి సెలవులు ఉన్నాయని.. మూడు వారాలైనా రక్షణ కల్పించాలని దవే పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ధర్మాసనం అంగీకరించలేదు.

Updated Date - May 24 , 2025 | 03:43 AM