Share News

మద్యం కేసులో.. కసిరెడ్డి పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్‌

ABN , Publish Date - May 20 , 2025 | 04:31 AM

మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. నిర్ణయం నేటికి రాకపోతే బెయిల్‌ కోసం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది.

మద్యం కేసులో.. కసిరెడ్డి పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్‌

  • నిర్ణయం సానుకూలంగా రాకుంటే.. బెయిల్‌ కోసం హైకోర్టుకే వెళ్లాలన్న ధర్మాసనం

న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజ్‌ కసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తుది తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసింది. తీర్పు అనుకూలంగా రానిపక్షంలో బెయిల్‌ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని రాజ్‌ కసిరెడ్డికి సూచించింది. మద్యం స్కాం కేసులో సీఐడీ సీఆర్పీసీ 160 ప్రకారం తనకు నోటీసులు జారీ చేసిందని, హైదరాబాద్‌లో ఉంటున్న తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదంటూ గత నెల 10న కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన కుమారుడి అరెస్టు అక్రమమని, జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయన తండ్రి ఉపేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించడంతో ఆ తీర్పును ఉపేందర్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ రెండు పిటిషన్లను కలిపి సోమవారం జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌.. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు మహేశ్‌ జెఠ్మలానీ, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది రమేశ్‌ అల్లంకి హాజరయ్యారు. తొలుత మహేశ్‌ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తూ.. కసిరెడ్డి అరెస్టు అక్రమమని.. సీఆర్పీసీ 160 ప్రకారం మరో రాష్ట్రంలో నివసిస్తున్న వ్యక్తికి సమన్లు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదని తెలిపారు. ఏప్రిల్‌ 21న విచారణకు స్వచ్ఛందంగా హాజరవుతానని చెప్పినప్పటికీ.. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారని.. అరెస్టు చేసినప్పుడు లేని సెక్షన్లను కుట్రపూరితంగా రిమాండ్‌ రిపోర్ట్‌లో చేర్చారని పేర్కొన్నారు.


అరెస్టు చేసినప్పుడు 409, 420 సెక్షన్ల ప్రకారం అదుపులోకి తీసుకున్నారని.. రిమాండ్‌ రిపోర్ట్‌లో మాత్రం అవినీతి నిరోధక చట్టాన్ని చేర్చారని తెలిపారు. రాజ్‌ కసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగా అని జస్టిస్‌ పార్ద్దీవాలా ప్రశ్నించగా.. ఆయన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఐటీ సలహాదారుగా పనిచేశారని జెఠ్మలానీ బదులిచ్చారు. ఎక్సైజ్‌ పాలసీకి, కసిరెడ్డికి ఎటువంటి సంబంధమూ లేదన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ, 19 సెక్షన్ల ప్రకారం సీఐడీ ఎటువంటి అనుమతులూ తీసుకోలేదని తెలిపారు. అయితే ఈ సెక్షన్లపై విస్తృత ధర్మాసనానికి ఇప్పటికే నివేదించామని జస్టిస్‌ పార్దీవాలా గుర్తుచేశారు. దీనికి సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే.. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత విస్తృత ధర్మాసనం ఎదుటే వినిపించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం తరఫున లూథ్రా వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలోనూ, కస్టడీ సమయంలోనూ పీసీ యాక్టుపై రాజ్‌ కసిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మాత్రం అభ్యంతరాలు లేవనెత్తారని తెలిపారు. కసిరెడ్డి చెబుతున్న దానికి, సుప్రీంకోర్టులో ఆయన తరఫు న్యాయవాదుల వాదనలకు పొంతనే లేదన్నారు. ఏపీ మద్యం కుంభకోణం చిన్న విషయమేమీ కాదని, రూ.వందల కోట్ల అవినీతికి సంబంధించిన అంశమని.. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరిగిందని తెలిపారు. కసిరెడ్డి అరెస్టులో నిబంధనలు అతిక్రమించలేదని అగర్వాల్‌ పేర్కొన్నారు. మరోసారి వాదనలు వినిపించేందుకు జెఠ్మలానీ సిద్ధమవగా.. ఇప్పటికే సుదీర్ఘంగా ఆలకించామని.. దీనిపై తమకు స్పష్టత వచ్చిందని జస్టిస్‌ పార్దీవాలా వ్యాఖ్యానించారు. సాయంత్రంలోపు ఇరుపక్షాల వాదనలను 2పేజీలకు మించకుండా లిఖితపూర్వకంగా అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. నిర్ణయం సానుకూలంగా రాకపోతే.. బెయిల్‌ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని కసిరెడ్డికి సూచిస్తూ తీర్పును రిజర్వ్‌ చేసింది.

Updated Date - May 20 , 2025 | 04:34 AM