Share News

Srilakshmi OMC Probe: ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్‌

ABN , Publish Date - May 08 , 2025 | 03:54 AM

ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిపై సమగ్ర విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన డిశ్చార్జ్‌ తీర్పును పునర్విచారణ చేయాలంటూ మూడు నెలల్లో ఆమె పాత్రపై స్పష్టత తీసుకురావాలని స్పష్టం చేసింది

Srilakshmi OMC Probe: ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్‌

  • ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై పునర్విచారణ అవసరమన్న ధర్మాసనం

  • తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం

  • ఆమె పాత్ర ఉందో లేదో 3 నెలల్లో తేల్చాలని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్‌ కేసు నుంచి విముక్తి పొందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆమె పాత్రపై మరోసారి సమగ్ర విచారణ అవసరమని తేల్చింది. మూడు నెలల్లో విచారణ జరిపి.. ఆమె పాత్ర ఉందో లేదో తేల్చాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ(ఓఎంసీ) అక్రమ తవ్వకాల కేసులో ఏ-6గా ఉన్న శ్రీలక్ష్మిపై కేసును 2022లోనే తెలంగాణ హైకోర్టు కొట్టేసింది (మంగళవారం కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు.. మిగిలిన నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే). దీనిని 2023 ఆగస్టు 3న సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో శ్రీలక్ష్మిది కీలక పాత్ర అని.. ప్రతివాదుల వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇదే కేసులో మిగిలినవారిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చి శిక్ష విధించిందని గుర్తుచేశారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ చేపట్టి 3 నెలల్లో ముగించాలని ఆదేశించింది.


చేసిన పాపం వెంటాడుతోంది!

  • శ్రీలక్ష్మి మెడపై ‘ఓఎంసీ’ కత్తి

  • హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు తారుమారైతే శిక్ష తథ్యం!

(అమరావతి/హైదరాబాద్‌-ఆంధ్రజ్యోతి)

చేసిన పాపాలు ఊరికే పోవంటారు.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి విషయంలో సరిగ్గా అదే జరుగుతోంది. అతిపిన్న వయసులోనే ఐఏఎస్‌ అధికారిగా ఎంపికైన ఆమె.. అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లడానికి ‘క్యాప్టివ్‌’ అనే ఒక్క పదం కారణమంటే ఆశ్చర్యం కలుగుతుంది. వైఎస్‌ ప్రభుత్వంలో గనుల శాఖ కార్యదర్శిగా ఆమె జారీ చేసిన జీవోలో ఆ ఒక్క పదాన్ని తొలగించి నాడు జైలుపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఆమె 2022లో తెలంగాణ హైకోర్టులో డిశ్చార్జ్‌ పిటిషన్‌ వేసి ఉపశమనం పొందారు. అయితే ఓఎంసీకి మైనింగ్‌ లీజుల జీవోలో ఆమె చేసిన కిరికిరి వ్యవహారమే మొత్తం కుంభకోణానికి దారి తీసిందంటూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీకి సొంత వాడకం కోసం గనులను లీజుకివ్వాల్సి ఉండగా.. మైనింగ్‌ కార్యదర్శి హోదాలో మంత్రికి సైతం తెలీకుండా ‘క్యాప్టివ్‌’ పదాన్ని తొలగించారని అందులో పేర్కొంది.


మైనింగ్‌ వ్యాపారులు సొంత పరిశ్రమ అవసరాల కోసం తీసుకునే లీజు విధానాన్ని ‘క్యాప్టివ్‌’ మైనింగ్‌ అంటారు. పొరుగు దేశాలకు ఎగుమతి చేసేందుకైతే క్యాప్టివ్‌ అనే మాట ఎక్కడా ఉండదు. వైఎస్‌ మంత్రివర్గ తీర్మానంలోనూ క్యాప్టివ్‌ అనే ఉంది. నాటి గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతకం చేసిన నోట్‌ ఫైలులోనూ అదే ఉండడంతో ఆమెను సీబీఐ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అప్పట్లో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి చేతిలో ఓఎంసీ మైనింగ్‌ లీజు ఫైలు పడగానే ‘క్యాప్టివ్‌’ మైనింగ్‌ అనే పదం ఎగిరిపోయింది. తద్వారా ఇనుప ఖనిజాన్ని జనార్దన్‌రెడ్డి స్టీల్‌ప్లాంటుకు కాకుండా విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయింది. నిబంధనలు పట్టించుకోకుండా ఫైలులో మార్పులు చేసిన శ్రీలక్ష్మి ఇచ్చిన జీవో.. ఈ మొత్తం కుంభకోణానికి కారణమైందన్నది సీబీఐ వాదన. ఓఎంసీకి ఐరన్‌ ఓర్‌ గనులు లీజుకిస్తే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోయే బ్రహ్మణి స్టీల్‌కు కోసం మాత్రమే ఉపయోగిస్తామని గాలి జనార్దన్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎ్‌సకు లేఖ రాశారు. లీజుల కోసం వచ్చిన 30 దరఖాస్తులనూ పరిశీలించాలని కేంద్రం చెప్పినప్పటికీ... ఓఎంసీకి ఆర్థిక సామర్థ్యం ఉందని.. ప్రతిపాదిత బ్రహ్మణి స్టీల్స్‌ కోసమే ఐరన్‌ఓర్‌ ఉపయోగిస్తారని శ్రీలక్ష్మి తెలిపారు. మిగతా దరఖాస్తులను పక్కనపెట్టారు.


కేంద్రం ముందస్తు అనుమతి ఇచ్చిన వెంటనే ఆగమేఘాలపై మిగతా దరఖాస్తుదారులకు కనీసం సమయం ఇవ్వకుండా షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ‘క్యాప్టివ్‌ యూసేజ్‌’ కింద లీజులు పొందినప్పటికీ ఆ పదమే లేకుండా ఆమె జీవో 151 జారీచేశారు. దీంతో లీజు అసలు ఉద్దేశానికి విరుద్ధంగా అక్రమంగా విదేశాలకు ఎగుమతులు చేసుకుని రూ. కోట్లు దండుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. గాలి జనార్దన్‌రెడ్డి, ఓఎంసీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్‌, ఆలీఖాన్‌ను దోషులుగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు.. శ్రీలక్ష్మికి కేసు నుంచి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమె జోలికి వెళ్లలేదు. అయితే ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజే సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు ఝలక్‌ ఇచ్చింది. శ్రీలక్ష్మి కేసు పునర్విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఆమెకు విముక్తి కల్పిస్తూ ఇదివరకు ఇచ్చిన తీర్పు తారుమారైతే ఆమెకు శిక్ష తప్పదని న్యాయనిపుణులు అంటున్నారు.


అత్యున్నత స్థాయికి వెళ్తారనుకుంటే..

కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ స్థాయికి వెళ్తారనుకున్న శ్రీలక్ష్మి.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌ పుణ్యమా అని ఓఎంసీ అక్రమ తవ్వకాల కేసులో చిక్కుకుని జైలు పాలయ్యారు. సీబీఐ 2011 నవంబరులో ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపింది. దీంతో ఆమె సస్పెండయ్యారు. అనారోగ్యం కారణంగా 2012 అక్టోబరులో బెయిల్‌పై విడుదలయ్యారు. 2016లో ఆమెపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె తెలంగాణ కేడర్‌కు వెళ్లారు. 2019లో జగన్‌ సీఎం అయ్యాక ఆంధ్ర కేడర్‌కు తీసుకొచ్చారు. అఖిల భారత సర్వీసు రూల్స్‌ను పక్కనపెట్టి వరుసగా పదోన్నతులు కూడా ఇచ్చారు. గత ఏడాది ఎన్నికల్లో జగన్‌ ఘోరపరాజయం పాలవడంతో ఆమె పరిస్థితి తలకిందులైంది. ఏపీ కేడర్‌లో అందరికన్నా సీనియర్‌గా ఉన్న ఈ ఐఏఎస్‌ అధికారికి కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వలేదు. 11 నెలలుగా పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్న ఆమె.. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌తో మళ్లీ జైలుకు వెళ్లే ప్రమాదంలో పడ్డారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ దాడిలో మరో కుట్ర..

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 03:54 AM