Kadapa crime: విద్యార్థిని హత్యలో యువకుని పాత్ర లేదు
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:24 AM
గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలో ఆమె ప్రియుడిగా భావిస్తున్న లోకేశ్ పాత్ర లేదని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు.

ఆమెపై లైంగిక దాడి జరగలేదు: కర్నూలు రేంజ్ డీఐజీ
జమ్మలమడుగు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలో ఆమె ప్రియుడిగా భావిస్తున్న లోకేశ్ పాత్ర లేదని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోటలో రంగనాథస్వామి దేవాలయం వెనుకభాగాన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి (17) సోమవారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశాన్ని ఎస్పీ అశోక్కుమార్తో కలిసి ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో డీఐజీ మాట్లాడారు. సోమవారం ఉదయం బాలిక వైష్ణవి, లోకేశ్ ద్విచక్ర వాహనంలో గండికోటకు వచ్చారన్నారు. దాదాపు రెండు గంటలపాటు ఓ ప్రైవేటు లాడ్జీలో ఉన్న తర్వాత ఇద్దరూ కోట గుమ్మం వద్దకు చేరుకున్నారని తెలిపారు. అనంతరం బాలికను అక్కడే వదిలి లోకేశ్ వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత బాలిక కోట ప్రాంగణంలో బ్యాగుతో తిరిగిందన్నారు. ఈ హత్యలో లోకేశ్ ప్రమేయం లేదన్నారు. అలాగే పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం బాలికపై లైంగిక దాడి జరగలేదన్నారు. హత్యకేసులో కీలక ఆధారాలు లభించాయని త్వరలోనే ఎస్పీ వివరాలు వెల్లడిస్తారని అన్నారు.