Talliki Vandanam: తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారం మానాలి.. లేదంటే..: మంత్రి లోకేష్
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:29 PM
'తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి, రూ.2వేలు నా ఖాతాలో పడ్డాయన్న వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు' అన్నారు మంత్రి నారా లోకేష్. 'వైసీపీ ప్రచారం చేస్తున్న మాటల్ని రుజువు చేయాలని, లేకుంటే..

అమరావతి: 'తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి రూ.2వేలు నా ఖాతాలో పడ్డాయన్న వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు' అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. 'వైసీపీ ప్రచారం చేస్తున్నట్టుగా రూ.2వేలు నా ఖాతాలో పడినట్లు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలి. అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తా. అసత్య ఆరోపణలని గతంలో మాదిరి భరించేది లేదు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు' అంటూ వైసీపీ దుష్ప్రచార మూకల్ని మంత్రి లోకేష్ హెచ్చరించారు.
అటు, ఉపాధ్యాయుల బదిలీలు సోమవారం కల్లా పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 'అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చాం. 'ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుతాం. ప్రజలందరూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి. తల్లికి వందనం అర్హులు ఎంత మంది ఉంటే అంత మందికీ లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి ఇచ్చింది. కానీ, కూటమి ప్రభుత్వం 67.27లక్షల మంది విద్యార్ధులకు పథకాన్ని వర్తింప చేస్తోంది. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తాం'. అని లోకేష్ తెలిపారు.
గత ప్రభుత్వం కంటే రూ.3,405కోట్లు అదనంగా తల్లికి వందనం నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పిన లోకేష్.. 'ఇప్పటివరకూ 18.55 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. 9,600 పాఠశాలల్లో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానం తెచ్చాం. గత ప్రభుత్వంలో కేవలం 1,200 పాఠశాలల్లో మాత్రమే ఈ విధానం అమలైoది. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లెయింట్ ద్వారా దాన్ని పరిష్కరిస్తాం. 2 శాతం మంది తల్లుల బ్యాంకు ఖాతాలు ఇనాక్టివ్లో ఉన్నాయి. వారిని మెసేజ్ ద్వారా అప్రమత్తం చేశాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర ద్వారా పిల్లలకు స్కూల్ కిట్ అందచేత చేపట్టాం' అని లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో పెడుతున్నామని లోకేష్ ఈ సందర్భంగా తెలియచేశారు.
ఇవి కూడా చదవండి
మరోసారి సిట్ ముందుకు ప్రణీత్ రావు
పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో
Read Latest Telangana News And Telugu News