Srisailam Dam : ఆర్థిక శాఖతోనే అసలు పేచీ
ABN , Publish Date - May 12 , 2025 | 03:58 AM
శ్రీశైల జలాశయానికి అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం నిధులు మంజూరయ్యినా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం లేదు, దానివల్ల నిర్మాణ సంస్థకు రూ.300 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

శ్రీశైలంలో మరమ్మతులకు ఏళ్ల తరబడి నిధులడుగుతున్నా ఇవ్వడం లేదు
కేంద్రం ఇచ్చినవాటికీ క్లియరెన్సుల్లేవు
ఇంజనీరింగ్ అధికారుల ఆవేదన
ప్రత్యేక సీఎస్ ఆధ్వర్యంలో అత్యవసర భేటీ
ఎన్డీఎస్ఏ లేఖపై చర్చ
డ్యాం పనులు చేస్తున్న కాంట్రాక్టరుకు రూ.300 కోట్ల బిల్లులు బకాయి
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో వివిధ నిర్మాణాల మరమ్మతులను ఆగస్టులోపు చేపట్టాలని.. లేదంటే పెనుప్రమాదం సంభవిస్తుందని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించింది. అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 5న రాసిన లేఖతో జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అప్రమత్తమయ్యారు. ఆదివారం సెలవుదినమైనప్పటికీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈఏన్సీ ఎం.వెంకటేశ్వరరావు, శ్రీశైలం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష జరిపారు. జలాశయానికి మరమ్మతులు చేయాలని 2009 నుంచి కోరుతున్నా ఆర్థిక శాఖ నిధులివ్వడం లేదని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జలాశయం కింద నిర్మించిన చిన్న రిజర్వాయరు కూడా ఆ వరదలకు కొట్టుకుపోయిందన్నారు. డివిడెండ్ రీన్వెస్ట్మెంట్ ప్లాన్ (డ్రిప్)-1 కింద కేంద్రం నుంచి రూ.936 కోట్లు విడుదలయ్యాయని.. అయితే వాటికి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్సులు రావడం లేదని చెప్పారు.
డ్రిప్-2 కింద కూడా శ్రీశైలం రక్షణ పనుల కోసం రూ.136 కోట్లు మంజూరయ్యాయని.. వాటికీ ఆ శాఖ నుంచి క్లియరెన్సులు రాలేదని సాయిప్రసాద్కు తెలిపారు. డ్రిప్-3లో ప్లంజ్పూల్ మరమ్మతులకు నిధులు విడుదలయ్యే వీలుందని చెప్పారు. ఇక జలాశయం ఎంత మేరకు దెబ్బతింది.. దానివల్ల జరిగే నష్టమేమిటో అధ్యయనం చేసేందుకు రూ.50 లక్షలు విడుదల చేయాలని ప్రాధేయపడుతున్నా ఆర్థిక శాఖ రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఎన్డీఎ్సఏ ఇచ్చిన నివేదిక భయం కలిగించేలా ఉందని సాయిప్రసాద్ పేర్కొన్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఈఎన్సీని ఆదేశించారు. డ్యాం భద్రతకు ఏదైనా జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈఎన్సీని, శ్రీశైలం ఇంజనీర్లను హెచ్చరించారు. నిధుల సమస్యల తలెత్తితే.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వద్ద పనులు చేస్తున్న నిర్మాణ సంస్థకు డ్యాం రక్షణ చర్యలు చేపట్టే బాధ్యతను అప్పగించాలని సూచించారు. కానీ ఆ కాంట్రాక్టు సంస్థకు రూ.300 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు చెప్పడంతో ఆయన మౌనం దాల్చారు.
డ్యాం పరిస్థితి భయానకం!
శ్రీశైలం జలాశయం స్పిల్వే నుంచి నీరు వేగంగా కిందకు ప్రవహిస్తుండడంతో దిగువన కొండరాళ్లు కోతకు గురై.. ప్లంజ్పూల్ వద్ద క్రమంగా భారీ గుంతగా మారి డ్యాం భద్రతకే ముప్పుగా మారిన సంగతి తెలిసిందే. దీనికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరడంతో.. అనిల్ జైన్ సారథ్యంలో ఎన్డీఎస్ఏ బృందం గత నెల 29న డ్యాంను పరిశీలించింది. ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని చూసింది. ఇంతకంటే ఘోరమైన.. భయానకమైన దుస్థితి నెలకొందని గుర్తించింది. యాప్రాన్ ప్రాంతంలో అమర్చిన స్టీల్ సిలెండర్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. డ్యాం దిగువ భాగంలోని ఫ్లిప్ బకెట్ ప్రాంతంలో స్టీల్ సిలెండర్లు రంద్రాలు పడి గాలిలో తేలియాడుతున్నాయి. వీటికి ఈ ఏడాది ఆగస్టులోగా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టకపోతే.. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ తాము పరిశీలించిన అంశాలతో ఈ నెల ఐదో తేదీన ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్కు అనిల్ జైన్ బృందం లేఖ రాసింది
. కళ్లకు కట్టినట్లుగా ఫొటోలు కూడా పంపింది. అప్రోచ్ చానల్కు రక్షణగా నిలవాల్సిన సిలెండర్లు పూరిగా దెబ్బతినడంతో.. డ్యాం పునాదుల్లోకి నీరు చేరి దెబ్బతింటాయని తెలిపింది. ప్రాజెక్టులోని ఇంటర్మీడియట్ లెవల్ గ్యాలరీలను కూడా సందర్శించింది. అవి మట్టి, ఇసుకతో నిండిపోవడం చూసి ఆశ్చర్యపోయింది. కుడి కాలువ ఎర్త్ లెవల్ 195 మీటర్ల వద్ద వేసిన అప్రోచ్ రోడ్ 2009 వరదల సమయుయలో పూర్తిగా కొట్టుకుపోయింది. అసలక్కడ రోడ్డున్న ఆనవాళ్లే ఇప్పుడు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అనిల్ జైన్ బృందం పలు ప్రమాద నివారణ చర్యలు సూచించింది. ప్లంజ్పూల్కు రెండు దశల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని తెలిపింది. ‘యాప్రాన్ కాంక్రీట్ను 10-13 బ్లాకులకు ఎదురుగా వేయాలి. 1983 తర్వాత నదీ ప్రవాహం వల్ల పునాదిలోతుల్లో పడుతున్న కోతను అంచనా వేయాలి. 11 నుంచి 13 దాకా ఉన్న స్టీల్ సిలెండర్లను మరమ్మతు చేయాలి. వీటిని 6.1 మీటర్ల ఎత్తులో కాంక్రీట్తో పూడ్చివేయాలి. తక్షణమే సిమెంట్ కాంక్రీట్ బ్లాక్లను రక్షణ కోసం ఏర్పాటు చేయాలి. ఇవే పనులు 9,10 బ్లాకుల్లోనూ చేపట్టాలి’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్నాథ్ సింగ్
For Andhrapradesh news and Telugu News