Srisailam: శ్రీశైలం డ్యాంపై జలసంఘం కార్యాచరణ
ABN , Publish Date - May 20 , 2025 | 05:29 AM
శ్రీశైలం జలాశయం పరిధిలో కేంద్ర జలసంఘం ఐదుగురు శాస్త్రవేత్తల బృందాన్ని పంపి ప్రాజెక్టు పరిస్థితులపై అధ్యయనం ప్రారంభించింది. దెబ్బతిన్న అప్రోచ్ రోడ్, టెయిల్ ఎండ్ ప్రాజెక్టు, ప్లంజ్పూల్ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

శాస్త్రవేత్త హనుమంతప్ప సారథ్యంలో ఐదుగురు రాక
ఎల్లుండి వరకు అక్కడే అధ్యయనం
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్, టెయిల్ ఎండ్ ప్రాజెక్టు, ప్లంజ్పూల్ పరిస్థితులపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) కార్యాచరణ చేపట్టింది. ప్రముఖ సైంటిస్టు హనుమంతప్ప సారథ్యంలోని ఐదుగురు శాస్త్రవేత్తల బృందాన్ని సోమవా రం ప్రాజెక్టు వద్దకు పంపింది. ఈ బృందం గురువారం (22వ తేదీ) దాకా అక్కడే ఉండి అధ్యయనం చేస్తుంది. జలసంఘం అధ్యయనం కోసం రూ.50 లక్షలు మంజూరు చేయాలని జలవనరుల శాఖ గతంలో పదే పదే కోరినా ఆర్థిక శాఖ దాటవేస్తూ వచ్చింది. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఆర్థిక శాఖతోనే అసలు పేచీ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై సీఎం చంద్రబాబు స్పందించడంతో ఆర్థిక శాఖ ది గొచ్చింది. గత శుక్రవారం రూ.50 లక్షలు విడుదల చేసిం ది. గతనెల 29, 30 తేదీల్లో జల సంఘం ఇంజనీర్ల బృందం, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎ్సఏ) చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం శ్రీశైలం జలాశయం వద్ద పర్యటించాయి. ఇవి అధ్యయనం చేసేంతవరకు.. డ్యాం స్పిల్వే ముందు ఏర్పడిన భారీ గొయ్యిపైనే కేంద్ర రాష్ట్రాలు ఆందోళన చెందేవి. అయితే పైబృందాల అధ్యయనంలో.. దానికంటే పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు తేలిం ది. డ్యాం పునాదుల వద్ద ఏర్పాటు చేసిన స్టీల్ సిలెండర్లు దెబ్బతినడం, ప్రాజెక్టు రాతి గోడలకు ఎలాంటి సిమెంట్ రివిటింగ్ లేకపోవడం, అప్రోచ్ రోడ్ దెబ్బతినడం, డ్యాంను అనుకుని ఉన్న కొండరాళ్లు కోతకు గురికావడం వంటివి బయటపడ్డాయి. తొలుత వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని.. లేదంటే ఆనకట్టకే భారీ ముప్పని అనిల్ జైన్ ఏకంగా జలవనరుల శాఖకు లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం బిత్తరపోయింది. పునరుద్ధరణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఈ క్రమంలోనే హనుమంతప్ప నేతృత్వంలో అధ్యయనం చేయనుంది.