APGOEA Meeting Leave: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్లుండి ప్రత్యేక సెలవు
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:05 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) సమావేశాలకు హాజరయ్యే ఉద్యోగులకు ప్రభుత్వ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది. ఈ నెల 5 తేదీన మాత్రమే ఒకరోజు సెలవు లభించే విధంగా జీవో జారీ చేశారు.

ఏపీజీఈఏ సమావేశాల కోసం సర్కారు మంజూరు
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) ఆధ్వర్యంలో జరుగనున్న సమావేశాలకు హాజరయ్యే రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం జీవో జారీచేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 5, 6 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని ఏపీజీఈఏ నిర్ణయించింది. వీటిలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా రెండ్రోజులు ప్రత్యేక సెలవులివ్వాలని ప్రభుత్వాన్ని సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కోరారు. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం పాక్షికంగా అంగీకరించింది. 5వ తేదీన మాత్రమే సెలవు మంజూరుచేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ ప్రత్యేక సెలవును పొందాలనుకునే ఉద్యోగులు తప్పనిసరిగా సాధారణ సెలవు కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని, వారికి మాత్రమే సెలవు లభిస్తుందని జీవోలో తెలిపింది.