Share News

Chief Secretary Vijayanand: మరికొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరణ

ABN , Publish Date - May 18 , 2025 | 04:19 AM

నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి సీఎస్‌ విద్యుత్‌ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Chief Secretary Vijayanand: మరికొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరణ

  • రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు

  • 22న అరేబియా సముద్రంలో అల్పపీడనం

  • నేడూ, రేపూ వానలు

  • ముందస్తు రుతుపవనాలతో అప్రమత్తం:సీఎస్‌

  • విద్యుత్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

విశాఖపట్నం, అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్‌ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలో పలు ప్రాంతాలు, అండమాన్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలో మిగిలిన భాగాలు, తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో దక్షిణమధ్య, ఈశాన్య బంగాళాఖాతం, అరేబియా సముద్రం, కొమరిన్‌లో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని శనివారం భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ నెల 21వ తేదీకల్లా కర్ణాటకను ఆనుకొని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తుందని, దాని ప్రభావంతో 22న అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తరువాత ఇది బలపడి వాయవ్యదిశగా పయనిస్తుందని తెలిపింది. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 49, ప్రకాశం జిల్లా డీజీపేటలో 47.7, కర్నూలులో 46.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేకచోట్ల ఉక్కపోత పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 41.3, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, పల్నాడు జిల్లా రావిపాడులో 40.3, ఏలూరు జిల్లా ఎస్‌ రాఘవాపురంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, ఎండతీవ్రత కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. రానున్న రెండు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


విద్యుత్‌ సమస్యలు తక్షణం పరిష్కరించండి: సీఎస్‌

ముందస్తు రుతుపవనాల ప్రభావంతో కురిసే గాలివాన పట్ల విద్యుత్‌ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ కె.విజయానంద్‌ ఆదేశించారు. ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అధికారులతో సీఎస్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాకాలం ముగిసేంత వరకూ డిస్కమ్‌ల సీఎండీలు రోజువారీ సమీక్షలు కొనసాగాలని నిర్దేశించారు. కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి రోజంతా విద్యుత్‌ సరఫరాను సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. సమావేశంలో ట్రాన్స్‌కో డైరెక్టర్‌ భాస్కర్‌, డిస్కమ్‌ల సీఎండీలు పృథ్వితేజ్‌, సంతోషరావు, పుల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 04:20 AM