Share News

Minister Kollu Ravindra: సిట్‌ విచారణతో జగన్‌ గుండెల్లో గుబులు

ABN , Publish Date - May 19 , 2025 | 05:37 AM

జగన్మోహన్ రెడ్డి మీద సిట్ విచారణ పెరుగుతోందని, ఆయనపై లిక్కర్ స్కాంలు, మైనింగ్ దోపిడీ, రేషన్ బియ్యం దొంగతనం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఈ అవినీతులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

 Minister Kollu Ravindra: సిట్‌ విచారణతో జగన్‌ గుండెల్లో గుబులు

  • ఒక్కొక్కటిగా బయటికొస్తున్న వైసీపీ లిక్కర్‌ స్కామ్‌లు

  • అక్రమార్కులు తప్పించుకునే పరిస్థితి లేదు

  • భార్యను కేసుల్లో ఇరికించిన బియ్యం దొంగ పేర్ని

  • గాలి మైనింగ్‌ బాగోతం బట్టబయలు: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, మే 18(ఆంధ్రజ్యోతి): అనేక అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్మోహన్‌రెడ్డికి సిట్‌ విచారణతో గుండెల్లో గుబులు మొదలైందని, ఆయనను చట్టరీత్యా అరెస్టు చేయడంలో ఆశ్చర్యమేమీలేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మచిలీపట్నంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ లిక్కర్‌ స్కామ్‌లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా తమ సొంత ఖాతాలలోకి లిక్కర్‌ షాపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్రమంగా జమ చేసుకున్నారని, దోచుకున్న డబ్బును విదేశాలకు పంపారని ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో భారీ లిక్కర్‌ స్కాం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారని, ప్రజలు విషపూరిత లిక్కర్‌కు బలై ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడి.. కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించడం సరికాదన్నారు. ఎక్సైజ్‌, మైనింగ్‌ పాలసీలను కూటమి ప్రభుత్వం పక్కాగా నిర్వహించిందని, సిట్‌తో విచారణ నుంచి అక్రమార్కులు తప్పించుకునే పరిస్థితి లేదని చెప్పారు. ఓబులాపురం గనులు దోచుకున్న గాలి జనార్ధనరెడ్డి బండారం బయటపడిందని, నాడు రాజశేఖరరెడ్డితో కుమ్మక్కై మైనింగ్‌ దోపిడీ చేసిన జనార్ధనరెడ్డికి ఎట్టకేలకు శిక్ష పడిందన్నారు. దీనిపై ఆనాడు టీడీపీ పోరాడిందని, టీడీపీ నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు. రేషన్‌ బియ్యాన్ని దోచుకుని భార్యను కేసుల్లో ఇరికించిన వారు అమాయకంగా మీడియా ముందు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఐదేళ్లు మంత్రిగా ఉన్న పేర్ని నాని బందరులో కనీసం రోడ్లు కూడా వేయలేదన్నారు.

Updated Date - May 19 , 2025 | 05:38 AM