Sheikh Nazir: సౌదీ చిత్రహింసల నుంచి విముక్తి
ABN , Publish Date - May 20 , 2025 | 05:13 AM
సౌదీ అరేబియాలో పనికి వెళ్లి చిత్రహింసకు గురైన నెల్లూరు కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ నజీర్ బాధితుడిని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఏపికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేపట్టాయి. కేంద్ర విదేశాంగ శాఖ, భారత ఎంబసీ సమన్వయంతో నజీర్ విముక్తి పొందాడు.

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన అధికారులు
బాధితుడిని ఏపీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లియజమాని చేతిలో చిత్రహింసలకు గురైన నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ నజీర్కు ఎట్టకేలకు విముక్తి లభించింది!. బాధితుడిని ఏపీకి తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, ఏపీ ప్రభుత్వ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కూలిపనులు చేసుకునే నజీర్ ఓ ఏజెంట్ మాటలు నమ్మి గతేడాది డిసెంబరులో రూ.2లక్షలు ఖర్చు చేసి సౌదీకి వెళాడు. అక్కడ ఓ యజమాని వద్ద పనికి కుదిరాడు. అయితే ఆయన పెద్దపెద్ద చెట్లు ఎక్కాలని ఇబ్బంది పెట్టేవాడు. చెట్లు ఎక్కకపోతే చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెడుతుండేవాడు. ఆ బాధను తాళలేని నజీర్ తన తల్లిదండ్రులకు వీడియో రికార్డు చేసి పంపాడు. ఈ విషయంపై.. ‘ఈ నరకం భరించలేను.. కాపాడండి!’ అనే శీర్షికన గత గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పందించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ను అప్రమత్తం చేశారు. ఆయన వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. వారు సౌదీ, అక్కడి భారత ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి నజీర్ ఎక్కడున్నదీ గుర్తించారు. సోమవారం, సౌదీ అధికారులు నజీర్ను భారత రాయబార కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. అధికారిక ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత నజీర్ను ఏపీకి పంపేందుకు భారత ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ తెలిపారు.