Sc Commission Chairman Ks Jawahar: ఎస్సీ హక్కుల పరిరక్షణే లక్ష్యం
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:20 AM
ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్
అమరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో సోమవారం ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు చైర్మన్గా అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పాలనలో దళితులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, అందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాలే కారణమని చెప్పారు. ఎస్సీల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్య, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎమ్మెస్ రాజు, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా... జవహర్ను అభినందించారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ డిప్యూటీ డైరక్టర్ బత్తుల జీవనపుత్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, తంగిరాల సౌమ్య, వేగుళ్ల జోగేశ్వరరావు, పితాని సత్యనారాయణ, శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.