RTC Employee Complaint: పునఃమూల్యాంకనంలోనూ మా అబ్బాయికి అన్యాయం
ABN , Publish Date - May 30 , 2025 | 04:13 AM
రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ ఉద్యోగి వీరభద్రరావు తన కుమారుడికి పునఃమూల్యాంకనంలో అన్యాయం జరిగిందని మంత్రి లోకేశ్కి ఫిర్యాదు చేశారు. హిందీ పేపర్లో పునఃమూల్యాంకనం కోసం రూ.1,000 చెల్లించినా మార్కులు మారలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగి ఆవేదన.. మంత్రి లోకేశ్కు ఫిర్యాదు
రాజమహేంద్రవరం అర్బన్, మే 29(ఆంధ్రజ్యోతి): పదోతరగతి జవాబు పత్రాల పునఃమూల్యాంకనంలోనూ తమ కుమారుడికి అన్యాయం జరిగిందని రాజమహేంద్రవరానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి వీరభద్రరావు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడు మణికంఠ ఇటీవల టెన్త్ పరీక్షలు రాయగా తెలుగులో 97, ఇంగ్లిష్లో 81, లెక్కల్లో 86, సైన్సులో 97, సోషల్లో 92 మార్కులు వచ్చాయని తెలిపారు. ఒక్క హిందీలో మాత్రం 52 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో హిందీ పేపర్ పునః మూల్యాంకనం కోరుతూ రూ.1,000 చెల్లించామన్నారు. కానీ, మళ్లీ అవే మార్కులు వేసి పంపారని, జవాబు పత్రాన్ని పునఃమూల్యాంకనం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెక్టుగా రాసిన జవాబులను సైతం కొట్టివేశారని, మార్కులు వేయకుండా ‘మార్పు లేదు’ అని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రి లోకేశ్కు ఫిర్యాదు చేసినట్టు వీరభద్రరావు వెల్లడించారు.