Share News

Rayapati Shailaja: అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు

ABN , Publish Date - May 20 , 2025 | 05:17 AM

రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించి మహిళల సాధికారత కోసం కృషి చేయాలని ప్రకటించారు. అసభ్య పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని హామీ ఇచ్చారు.

Rayapati Shailaja: అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు

  • మహిళా సాధికారతకు కృషి.. మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరణ

అమరావతి, మంగళగిరి, మే 19(ఆంధ్రజ్యోతి):హిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తూ, సమాజంలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల దాడులను, అఘాయిత్యాలను నిరోధించేందుకు నా వంతు కృషి చేస్తా’ అని రాయపాటి శైలజ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో చైర్‌ పర్సన్‌గా అధికారుల సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘గతంలో మా వద్ద నమోదైన పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తా. అవసరమైతే వాటిని జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు సరైన న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా. సోషల్‌ మీడియా వేదికగా ఎవరైనా మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే వారిపై శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మహిళలు తమపై జరుగుతున్న దాడులను నేరుగా నా దృష్టికి తీసుకువచ్చేందుకు మా శాఖ ద్వారా నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాం. కూటమి ప్రభుత్వం నాపై ఎంతో నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తా. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తాను. బాధితులకు సత్వరమే న్యాయ పరిష్కారం చూపేందుకు కృషి చేస్తా’ అని శైలజ తెలిపారు. ఈ సందర్భంగా కీలక బాధ్యతలు అప్పజెప్పిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ మారిటల్‌ కౌన్సెలింగ్‌ సెంటర్ల ఏర్పాటు ఫైలుపై చైర్‌పర్సన్‌ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె కు... మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌, భాష్యం రామకృష్ణ, వ్యాపార వేత్త రాయపాటి గోపాలకృష్ణ, రమేశ్‌ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ రమేశ్‌ బాబు, టీడీపీ నేత శివ నాగమల్లేశ్వరరావు అభినందనలు తెలిపారు.

Updated Date - May 20 , 2025 | 05:17 AM