Raghurama Krishna Raju: చిల్లర రాజకీయాలు వద్దన్నందుకే జగన్తో గొడవ
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:21 AM
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2019లో జగన్తో జరిగిన గొడవను వివరించారు. కోడెల శివప్రసాదరావు గురించి చిల్లర రాజకీయాలు చెయ్యకుండా మాట్లాడటానికి జగన్తో ఆయన వాగ్వాదం జరిగింది

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
రాజుపాలెం, గుంటూరు, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ‘2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు కోడెల శివప్రసాదరావు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వారిని అడ్డుకొని పదవులకు వన్నె తెచ్చే వారి గురించి చిల్లరగా మాట్లాడవద్దని చెప్పా. దీంతో గత సీఎం జగన్తో నాకు గొడవ జరిగింది’ అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. శుక్రవారం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలోని బలిజేపల్లి గ్రామంలో ఎన్టీఆర్, నవ్యాంధ్ర తొలి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుల విగ్రహావిష్కరణ, సచివాలయ ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కోడెల సభ నడిపిన తీరు, క్రమశిక్షణ ఆచరణీయమన్నారు. ఆయన స్ఫూర్తితోనే సభను నడిపిస్తున్నట్లు చెప్పారు. తనకు స్ఫూర్తి ఇచ్చిన నాయకులలో కన్నా ఒకరని చెప్పారు.
డాక్టర్ ప్రభావతికి జ్ఞాపక శక్తి తిరిగిరావాలని కోరుకున్నా
తన కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి జ్ఞాపక శక్తి తిరిగి రావాలని ఇటీవలే తిరుపతి వెళ్లినప్పుడు కోరుకొన్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆమెకు జ్ఞాపకశక్తి తిరిగి రావాలంటే కోర్టు నుంచి కల్పించిన తాత్కాలిక రక్షణ రద్దు కావాలి. అందుకోసం నేను నిరీక్షిస్తున్నా. కేసు 24కి వాయిదా పడింది. బహుశ ఆ రోజున ఆమెకు జ్ఞాపకశక్తి తిరిగొస్తుందని ఆశిస్తున్నా’ అని రఘురామ అన్నారు.