Health Staff Misconduct: ముఖహాజరు మాయాజాలంతో విధులకు ఎగనామం!
ABN , Publish Date - May 06 , 2025 | 06:15 AM
రాష్ట్రవ్యాప్తంగా 224 మందికి చెందిన పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బంది హాజరు నమోదు హైజింక్లపై చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐఫోన్ ద్వారా హాజరు సెట్టింగ్లను ట్యాంపర్ చేసి విధులు పూర్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

224 మంది పీహెచ్సీల వైద్యాధికారులు, ఇతర సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు
ఏలూరు అర్బన్, మే 5(ఆంధ్రజ్యోతి): ముఖ గుర్తింపు ఆధారిత(ఎ్ఫఆర్ఎస్) హాజరు నమోదులో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 224 మంది పీహెచ్సీల వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులపై చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుం బ సంక్షేమ శాఖ డైరెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. హాజరు నమోదులో ఐఫోన్లలోని అధునాతన సాంకేతికను ఉపయోగించి తేదీ, సమయం సెట్టింగ్ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా హెల్త్ ఎఫ్ఆర్ఎస్ మొబైల్ యాప్లో బురిడీ కొట్టించారని ఎఫ్ఆర్ఎస్ స్టేట్ నోడల్ అధికారి గతనెల 10న గుర్తించారు. పీహెచ్సీల సిబ్బందికి కేటాయించిన ప్రధాన స్థానాల్లో విధిగా ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేయాల్సి ఉండగా, కొందరు తమకు అనువైన సబ్ సెంటర్లను, మరికొందరు ఇతర ప్రాంతాలను మ్యాపింగ్ చేసుకుని ఐఫోన్ల ద్వారా ట్యాంపరింగ్ చేస్తూ హాజరు వేసి వెళ్లిపోతున్నట్టు గుర్తించారు. ఇలా చేయడం వల్ల పీహెచ్సీలు, వాటి పరిధిలో వైద్య సేవలకు విఘాతం కలుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లలో డేట్, టైం సెట్టింగ్లను ట్యాంపరింగ్ చేసి ఎఫ్ఆర్ఎస్ యాప్లో హాజరు నమోదు చేసిన 224 మందిని గుర్తించారు. ఇలా గుర్తించిన వారిలో రెగ్యులర్ వైద్యాధికారులు, ఉద్యోగులపై సీసీఏ రూల్స్ప్రకారం చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ మెడికల్ ఆఫీసర్లు, ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలన్నారు.