Share News

Perni Nani: నాడు రంగా... నేడు వంశీ

ABN , Publish Date - May 25 , 2025 | 04:57 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మరణమే టీడీపీ పతనానికి కారణమని తెలిపారు. వంశీ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్నారని, ప్రభుత్వ వైద్యులపై తీవ్ర ఆరోపణలు చేసినారు.

Perni Nani: నాడు రంగా... నేడు వంశీ

  • టీడీపీ పతనానికి వారి మరణాలే కారణం

  • వంశీ మరణమే టీడీపీని బలి తీసుకుంటుంది: మాజీ మంత్రి పేర్ని

విజయవాడ, మే 24(ఆంధ్రజ్యోతి): ‘‘ఒక్కో పతనానికి ఒక్కో కారణం ఉంటుంది. నాడు వంగవీటి మోహనరంగా హత్య ఎన్టీఆర్‌ పతనానికి కారణమైంది. ఇప్పుడు వంశీ మరణమే టీడీపీని బలి తీసుకుంటుంది’ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. పోలీసు కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను అస్వస్థత కారణంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయనను పరామర్శించడానికి వచ్చిన నాని ఆసుపత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వం చేస్తున్న కుట్రల వల్ల వంశీకి ఏదైనా జరిగితే అతని మరణమే ప్రభుత్వాన్ని బలి తీసుకుంటుంది. ఊపిరాడడం లేదని, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందనీ వంశీ కోర్టుకు చెప్పుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు రోజూ రాత్రిపూట సీపీఆర్‌ మిషన్‌ పెట్టుకుంటున్నారు. దొంగ పట్టాల పంపిణీ చేశారంటూ వంశీపై కేసు నమోదు చేశారు. అది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో చంద్రబాబు, లోకేశూ ముద్దాయిలే. వారినీ విచారించాలి. తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మాజీ ఎమ్మెల్యేను పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకురావడం హేయమైన చర్య. ప్రిస్ర్కిప్షన్‌ రాయాల్సిన వైద్యులు పెన్నుల్లో ఇంక్‌ అయిపోందని చెబుతున్నారు’ అని పేర్ని అన్నారు. వంశీని పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఉన్నారు.


పేర్ని అనుమానాలు.. వైద్యుల ఆగ్రహం

‘ఈ ఆసుపత్రికి ఓ సూపరింటెండెంట్‌ ఉన్నాడు. ఆయన మత్తు డాక్టరు. ఆసుపత్రిలో అందరినీ మత్తులో పెట్టాడు. దిక్కుమాలిన ఉద్యోగం కోసం చంద్రబాబు, లోకేశ్‌కు చెంచాగిరి చేస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే ఊపిరితిత్తులు ఆడక, గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంటే ‘ఏమీ లేదు... నీరసంగా ఉన్నారు. దారిలో ఓఆర్‌ఎస్‌ కొనుక్కొని తాగండి’ అని చెప్పాడు. రాజధాని నడిబొడ్డున ఉన్న ఆసుపత్రిలో ఓఆర్‌ఎస్‌ కూడా లేదు. ఆ వెధవ ఓఆర్‌ఎస్‌ తెప్పించాలి కదా? పరీక్షలు, మందులు ఎవరూ రాయద్దని ఆర్డర్‌ వేశాడు.’ అంటూ పేర్ని ఆరోపించారు.

కాగా, పేర్ని వ్యాఖ్యలను ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండించింది. నాని తన మాటలను వెనక్కి తీసుకోకుంటే జీడీఏ నుంచి యాక్షన్‌ ఉంటుందని హెచ్చరించింది. రాజకీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని, ప్రభుత్వ వైద్యులకు క్షమాపణ చెప్పాలని మంత్రి సత్యకుమార్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - May 25 , 2025 | 04:59 AM