AP Deputy Pawan Kalyan: ఉగ్ర కదలికలపై అప్రమత్తం
ABN , Publish Date - May 20 , 2025 | 05:24 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉగ్రవాద సానుభూతిపరులపై రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రకదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుకు ఆదేశించారు.

సానుభూతి పరులను గుర్తించండి
అనుమానితుల వివరాలు వెలికితీయండి
సీఎస్, డీజీపీలకు డిప్యూటీ సీఎం లేఖలు
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతి పరుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్ అరెస్టు, అతనికి నిషేధిత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయని తేలడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం కావాలని సూచించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ మేరకు పల సూచనలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలకు సోమవారం ఆయన లేఖలు రాశారు. ఇదే సమయంలో సాధారణ పరిపాలన శాఖకు కూడా పలు సూచనలు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చిందని, దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. విజయనగరంలో సిరాజ్ అనే యువకుడికి ఐఎ్సతో సంబంధాలన్నాయని, పేలుళ్లకు కుట్రపన్నిన విషయాన్ని తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్టు చేసిన క్రమంలో కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాలన్నారు. ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికి, వారి కదలికలపై అన్ని జిల్లాల అధికారులు తక్షణం అప్రమత్తం కావాలన్నారు. ఎక్కడైనా ఉగ్రనీడలు, వారి జాడలు కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
వారికి.. ఐడీలున్నాయా?
రాష్ట్రంలోని అక్రమ వలసదారులు, ఉగ్రవాద సానుభూతిపరులపై ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి మరింత లోతుగా విచారణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. గతంలో రాష్ట్రంలో ఏవైనా ఉగ్ర కార్యకలాపాలు జరిగి ఉంటే వాటిలో పాల్గొన్న వారిపై పూర్తిస్థాయి నిఘా అవసరమని తెలిపారు. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ లేఖలో రోహింగ్యాల విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంటూరుతో పాటు ఇతర జిల్లాల్లో రోహింగ్యాల ఉనికి ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. వీరిలో కొందరికి రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నాయనే సమాచారం వస్తోందని, ఇది ఆందోళనకర పరిణామమని పేర్కొన్నారు. అనుమానితులు ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ మొదలైన గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారా?. ఉంటే.. వీటిని వారు ఎలా పొందారు? వారికి ఆశ్రయం ఇచ్చిందెవరు? స్థానికంగా వారికి ఎవరు సౌకర్యాలు కల్పిస్తున్నారు? వారికి సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.
జాతీయ, ప్రజల భద్రత ముఖ్యం
జాతీయ భద్రత, ప్రజల భద్రత అత్యంత ప్రాధాన్యంతాంశంగా పరిగణించి తక్షణం చర్యల తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. కొన్నేళ్ల కిందట గుంటూరు, గతేడాది రాయలసీమ ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆ విషయాలను గమనంలోకి తీసుకోవాలని సూచించారు. దేశ భద్రత, ప్రజల రక్షణ అనేవి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని తెలిపారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం శాంతి భద్రతలతో పాటు అంతర్గత భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తేనే.. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వ చర్యలకు రాష్ట్ర సహకారం తోడవుతుందని పేర్కొన్నారు.