AP DGP: రాష్ట్రంలో 21 మంది పాకిస్థానీలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:22 AM
పాకిస్థాన్ జాతీయులపై రాష్ట్రంలో 21 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వారిని ఈ నెల 29 లోపు దేశం విడిచి వెళ్లాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

తక్షణం దేశం వీడాలని పోలీసుల ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): పహల్ గామ్ ఉగ్రదాడిని అత్యంత సీరియ్సగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రంలోనూ పోలీసులు గట్టిగా అమలు చేస్తున్నారు. పాకిస్థాన్ జాతీయులు తక్షణమే రాష్ట్రం విడిచి వెళ్లి పోవాల్సిందిగా పలు జిల్లాల పోలీసులు ఆదేశించారు. శుక్ర, శనివారాల్లో సమీక్ష నిర్వహించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాష్ట్రంలో ఎక్కడ పాకిస్థానీయులు ఉన్నా తక్షణమే వారిని దేశం నుంచి పంపించేయాలని జిల్లాల ఎస్పీలను, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం 21మంది పాకిస్థానీయులు వారిలో 14 మంది ఆదివారం లోపు వెళ్తామని చెప్పగా, మరో ఏడుగురు వైద్య సేవల కోసం వచ్చామని సోమవారం ఆస్పత్రిలో చూపించుకుని ఈనెల 29న దేశం విడిచి పాకిస్థాన్కు వెళ్లిపోతామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టి అందరినీ ఈ నెల 29లోపు దేశం దాటి పోయేలా చూడాలని ఎస్పీలకు డీజీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా డీజీపీ చెప్పారు.