Modi-Chandrababu: మోదీ సర్కారు తీరుపై సీఎం చంద్రబాబు అభిప్రాయాలు
ABN , Publish Date - Jun 08 , 2025 | 10:33 PM
భారతదేశం అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందా లేదా అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వాదన గురించి అడిగినప్పుడు, చంద్రబాబు 'ఎవరికీ లొంగిపోవాల్సిన అవసరం లేదు' అని బదులిచ్చారు. మాకు మా సొంత వ్యూహాలు ఉన్నాయి. ట్రంప్ను ఎవరు నియంత్రిస్తారు? ఆయన తనకు నచ్చినట్లు మాట్లాడతారు అని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నేషనల్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత పరిణామాలను చంద్రబాబు స్వాగతించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని "గ్లోబల్ లీడర్" అని ప్రశంసించారు. ఇండియా టుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎకు మద్దతు ఇస్తున్న నాయుడు, భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక సంఘర్షణను ఆపడంలో ప్రధాని మోదీ పాత్ర అద్భుతమని కీర్తించారు.
భారతదేశం అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందా లేదా అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వాదన గురించి అడిగినప్పుడు, చంద్రబాబు 'ఎవరికీ లొంగిపోవాల్సిన అవసరం లేదు' అని బదులిచ్చారు. 'మాకు మా సొంత వ్యూహాలు ఉన్నాయి. ట్రంప్ను ఎవరు నియంత్రిస్తారు? ఆయన తనకు నచ్చినట్లు మాట్లాడతారు. కానీ అదే సమయంలో, ప్రధాని మోదీ పరిపక్వత గెలిచింది. మేము చాలా స్పష్టంగా ఉన్నాము. మేము అనవసరంగా గొడవ పడము. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వాళ్లని విడిచిపెట్టం. మేము మా దేశాన్ని రక్షించుకోగలం' అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
'ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత నాయకుడిగా ఎదుగుతున్నారు. అది మా దేశానికి గర్వకారణం' అని కూడా చంద్రబాబు అన్నారు. వక్ఫ్ చట్టంపైనా చంద్రబాబు తన అభిప్రాయన్ని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం మెరుగుపరచడానికి ప్రయత్నించే వక్ఫ్ (సవరణ) చట్టానికి తాము మద్దతు ఇచ్చామని ఈ చట్టం ముస్లింలకు అనుకూలంగా ఉందని అన్నారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్లో తన పదవీకాలంలో, తన ప్రభుత్వం 13 జిల్లాల్లో ఉర్దూను రెండవ భాషగా చేసిందని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం మీద కూడా చంద్రబాబు తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. 'మేము ప్రారంభం నుండి దీనికి మద్దతు ఇస్తున్నాము. మేము ప్రగతిశీలురం. ఎన్నికల తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు పరిపాలనపై దృష్టి పెట్టవచ్చు. అన్ని అంశాలలో ప్రజలకు సాధికారత కల్పించవచ్చు. మనకు మరికొన్ని ఎన్నికల సంస్కరణలు అవసరం. ఎన్నికలు, ఉప ఎన్నికలు, ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేవు ' అని చంద్రబాబు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. బాధ్యులపై కఠిన చర్యలు
కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు
For AndhraPradesh News And Telugu News