Share News

Sand Smuggling: హైటెక్‌దందా

ABN , Publish Date - May 19 , 2025 | 05:24 AM

తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కొత్త మార్గాలు, హైటెక్‌పద్ధతులతో జరుగుతోంది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి ఎస్కార్ట్ వాహనాలు, మొబైల్ యాప్‌ల సహాయంతో ఇసుక దొంగతనం కొనసాగుతోంది.

Sand Smuggling: హైటెక్‌దందా

  • తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త పంథా

  • అడ్డదారుల్లో భారీగా తరలింపు

  • పోలీసుల కన్నుగప్పేందుకు కొత్త మార్గాలు

  • ఎన్టీఆర్‌ జిల్లా నుంచి వెళ్లే లారీలకు

  • ఖరీదైన కార్లతో ఎస్కార్ట్‌

  • మై వీల్స్‌ మొబైల్‌ యాప్‌తో రూటు డైరెక్షన్‌

  • కృష్ణా జిల్లా నుంచి గుంటూరు మీదుగా..

  • రాజధాని పేరు చెప్పి హైదరాబాద్‌కు

  • లారీలపై కాంట్రాక్టు సంస్థల లోగో

ఇసుక సిండికేట్‌ మాఫియా రోజుకో కొత్త పంథాలో ముందుకు సాగుతోంది. ఇందుకు కొత్త మార్గాలను, హైటెక్‌ పద్ధతులను అనుసరిస్తోంది. ఖరీదైన ఎస్కార్ట్‌ వాహనాలతో, మొబైల్‌ యాప్‌ సాయంతో యథేచ్ఛగా దందా సాగిస్తోంది.

(విజయవాడ/కంచికచర్ల-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల విజయవాడ నగరం, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలలో ఇసుక అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కారుచౌకగా టన్ను రూ.200లకే లభిస్తోంది. ఇది కొనుగోలుదారులకు వరంగా మారింది. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. మరోవైపు... ఇసుక సిండికేట్‌ మాఫియాకు ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో కాసులు దండుకునేందుకు రూటు మార్చారు. తెలంగాణ ప్రాంతానికి ఇసుకను అక్రమంగా విచ్చలవిడిగా తరలిస్తున్నారు. ఇందుకు కొత్త మార్గాలను, హైటెక్‌ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఆంరఽధాలో ప్రధానంగా ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నుంచి.. కృష్ణా జిల్లాలో కంకిపాడు, రొయ్యూరు, తోట్లవల్లూరు, మద్దూరు, పెదపులిపాకల నుంచి ఇసుక తరలిపోతోంది. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ఎస్కార్ట్‌ వాహనాల ద్వారా తెలంగాణకు.. కృష్ణా జిల్లా నుంచి రాజధాని పేరు చెప్పి గుంటూరు మీదుగా హైదరాబాద్‌కు తరలించేస్తున్నారు. ఇసుక దోపిడీని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో ట్రైనీ ఐపీఎ్‌సలను నియమించి అక్కడి ప్రభుత్వం చెక్‌ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఇసుక టిప్పర్లపై వరుసగా దాడులు చేసి సీజ్‌ చేస్తున్నారు. అయినా అక్రమ రవాణా ఆగడం లేదు. తెలంగాణలో ఉన్న ఇసుక డిమాండ్‌ రీత్యా ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలలోని అధికారిక, అనధికారిక రీచ్‌ల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. తెలంగాణలో పోలీసులు పట్టుకుంటున్న ఘటనలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఏ వాహనాలకూ వే బిల్లులు లేవు.


ఎన్టీఆర్‌ జిల్లా నుంచి..

ఎన్టీఆర్‌ జిల్లాలో క కృష్ణానది, మున్నేరు, కట్టలేరుల నుంచి ఇసుక తరలిపోతోంది. ఇసుక సిండికేట్‌ మాఫియా అనుసరించే విధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్లే ఇసుక లారీలకు ముందుగా ఎస్కార్ట్‌ వాహనాలు వెళుతున్నాయి. మే 2న మధిరలో పట్టుబడిన 3 లారీలకు 3 కార్లు ఎస్కార్టుగా ఉన్నాయి. ఎస్కార్టు వాహనాలలో ఉండే సిబ్బంది, వెనుక వచ్చే లారీ డ్రైవర్‌ ఫోన్లు నిరంతరం ఆన్‌లోనే ఉంటాయి. ఎస్కార్టు ఇచ్చే డైరెక్షన్‌ ప్రకారం వెనుక లారీలు కదులుతాయి. టిప్పర్‌లో 45 నుంచి 50 టన్నులకు తక్కువ కాకుండా ఓవర్‌లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్నారు. తెలంగాణలో ఇసుక భారీగా ధర పలుకుతోంది. హైదరాబాద్‌ అయితే టన్నుకు రూ.1700, ఖమ్మం అయితే రూ.1400- రూ.1500 వరకు ధర గిట్టుబాటు అవుతోంది.

మై వీల్స్‌ మొబైల్‌ యాప్‌ సాయంతో..

ఎన్టీఆర్‌ జిల్లా నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న సిండికేట్‌ మాఫియా మై వీల్స్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోంది. ఈ యాప్‌ ద్వారా డ్రైవర్‌కు ఒక రూట్‌ సెట్‌ చేస్తారు. ఆ రూట్‌లో లారీ చక్రం ఆగినా యజమానికి అలర్ట్‌ వస్తుంది. పోలీసులు ముందు ఉన్నారని ఎస్కార్ట్‌ ద్వారా తెలిస్తే వెంటనే ఈ యాప్‌ ద్వారా డ్రైవర్‌కు మరో జీపీఎస్‌ రూట్‌ సెట్‌ చేస్తారు. ఇలా లారీ డ్రైవర్‌ కంగారు పడకుండా వాహనాలను మళ్లిస్తారు.


కృష్ణా జిల్లా నుంచి..

కృష్ణా జిల్లాలో కృష్ణానదీ తీరం వెంబడి కరకట్ట రోడ్డు మీదుగా యనమలకుదురు, రామలింగ్వేర్‌నగర్‌ మీదుగా వాహనాలను గుంటూరు తరలిస్తున్నారు. వాహనాలను అడ్డుకోకుండా రాజధానిలోని కాంట్రాక్టు సంస్థల లోగోలను ఇసుక లారీల మీద అంటించి గుంటూరు తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

దొంగ రూట్లు ఇలా..

  • ఎన్టీఆర్‌ జిల్లాలో జగ్గయ్యపేట నుంచి కంచికచర్ల మీదుగా ఖమ్మం, జగ్గయ్యపేట నుంచి నేరుగా ఖమ్మం, నందిగామ నుంచి వయా మధిర మీదుగా ఖమ్మం, కంచికచర్ల నుంచి వయా ఎర్రుపాలెం మీదుగా ఖమ్మం, కంచికచర్ల నుంచి ఎర్రుపాలెం, వైరా మీదుగా ఖమ్మం తరలిస్తున్నారు. ఇవి కాకుండా మరో 10 నుంచి 15 డొంక రూట్లు ఉన్నాయి.

  • కృష్ణా జిల్లా నుంచి వచ్చే లారీలు కృష్ణా కరకట్ట మీదుగా విజయవాడ, గుంటూరుకు అక్కడి నుంచి రొంపిచర్ల-అద్దంకి-నార్కట్‌పల్లి రూట్‌లో హైదరాబాద్‌కు వెళుతున్నాయి.

Updated Date - May 19 , 2025 | 06:42 AM