Kakani CID custody: సీఐడీ అదుపులో కాకాణి.. ఏ కేసులో అంటే
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:43 AM
Kakani CID custody: ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్లు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకాణిని విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నెల్లూరు, జూన్ 10: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని (Former Kakani Goverdhan Reddy) సీఐడీ అధికారులు (CID Officers) అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై (Somireddy Chandramohan Reddy) సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో భాగంగా క్వార్ట్జ్ అక్రమాల కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్లు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకాణిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుని అక్కడి నుంచి భారీ భద్రత నడుమ మంగళగిరికి తరలించారు. ఈరోజు గుంటూరులోని కోర్టులో మాజీ మంత్రిని హాజరుపర్చనున్నారు.
మరోవైపు కాకాణికి వరుసగా కేసులన్నీ చుట్టుకుంటున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం హయాంలో సర్వేపల్లిలో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు ఆ కేసు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు వంద కోట్లకు పైగా గ్రావెల్ అక్రమాలు ఒకే ప్రాంతంలో జరిగాయి. ఆ అక్రమాల్లోనే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. దీనిపై కూడా కేసు నమోదు అయ్యింది. అలాగే కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో ఓ టోల్గేట్ను ఏర్పాటు చేసి భారీ వాహనాల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేశారు. దానికి సంబంధించి కూడా ముత్తుకూరు పోలీస్స్టేషన్లో మాజీ మంత్రితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక క్వార్ట్జ్ అక్రమాల కేసుకు సంబంధించి కాకాణి వేసిన బెయిల్ పిటిషన్పై రేపు (బుధవారం) నెల్లూరు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఇప్పటికే డిఫెన్స్ వాదనలు ముగియగా.. రేపు పోలీసుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. అలాగే ఇదే కేసుకు సంబంధించి విచారణకు కాకాణి సహకరించని పరిస్థితి. ఈ కేసుపై మొదట్లో నోటీసులు ఇచ్చినా తీసుకోని కాకాణి.. తర్వాత రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగారు. ఇటీవల అరెస్ట్ అయి రిమాండ్పై జైలుకు వెళ్లిన తర్వాత మూడు రోజుల పాటు కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే క్వార్ట్జ్ అక్రమాలపై పోలీసులు దాదాపు 60 ప్రశ్నలు సంధించగా.. కేవలం రెండు మూడు ప్రశ్నలకు మాత్రమే మాజీ మంత్రి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కాకాణిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరనున్నారు. దానిపై కూడా రేపు కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
నాకు డ్రగ్స్ ఇచ్చారు.. పోలీసుల విచారణలో సోనమ్..
ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
Read latest AP News And Telugu News