Share News

Minister Achennaidu: అధైర్యం వద్దు అండగా ఉంటాం

ABN , Publish Date - May 25 , 2025 | 04:18 AM

వివసాయ మంత్రి అచ్చెన్నాయుడు బర్లీ పొగాకు రైతులకు అండగా ఉండి, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పొగాకు కొనుగోళ్లలో న్యాయమైన ధరలు పెట్టి రైతుల హక్కులను రక్షిస్తామని చెప్పారు.

Minister Achennaidu: అధైర్యం వద్దు అండగా ఉంటాం

  • బర్లీ పొగాకు రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు హామీ

బాపట్ల, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘‘ అన్నదాతలూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు...ప్రభుత్వం అండగా ఉంటుంది. పొగాకు కంపెనీలు కథలు చెప్పడం మాని బర్లీ పొగాకు కొనేందుకు బాధ్యత తీసుకోవాల్సిందే. ఈ విషయంపై ముఖ్యమంత్రి సీరియ్‌సగా ఉన్నారు. కొనుగోళ్ల విషయంలో క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపెట్టాల్సిందే’’ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా మార్టూరులోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో శనివారం బర్లీ పొగాకు రైతులతో నిర్వహించిన ముఖాముఖికి ఆయన హాజరయ్యారు. రైతులు తమ ఆవేదనను మంత్రి ముందుంచారు. కంపెనీలు తమను సాగు చేసేలా ప్రేరేపించి ఇప్పుడు వంచించాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు డిమాండ్‌ లేకపోతే పొగాకును ప్రాసెసింగ్‌ చేసి నిల్వ ఉంచుకోవాలని కంపెనీలకు సూచించారు. ప్రాసెసింగ్‌కు ఖర్చు తామే భరిస్తామన్నారు. బర్లీలో రెండు రకాలుగా కొనుగోళ్లు జరగాలని...అందులో లో గ్రేడ్‌ రకానికి రూ.5,000 నుంచి రూ.6,000 వరకు, మీడియం, హై క్వాలిటీ రకాలకు రూ.12,000లు ధర క్వింటాలుకు చెల్లించాల్సిందేనని కంపెనీలకు తేల్చిచెప్పారు.

Updated Date - May 25 , 2025 | 04:19 AM