Share News

Mega DSC 2025: నేటి నుంచే మెగా డీఎస్సీ

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:37 AM

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా మెగా డీఎస్సీ-2025 పరీక్షలు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి.

Mega DSC 2025: నేటి నుంచే మెగా డీఎస్సీ

  • 30 వరకు రోజూ 2 సెషన్లలో పరీక్షలు

  • గంటన్నర ముందే కేంద్రాల్లోకి అనుమతి

  • హాల్‌ టికెట్‌, ఫొటో గుర్తింపు కార్డు

  • తప్పనిసరి.. పెన్నులకు అనుమతి

  • పేపర్లు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు నిషేధం

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా మెగా డీఎస్సీ-2025 పరీక్షలు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీ, ప్రిన్సిపాల్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు మూడు గంటలు, మిగిలిన పోస్టులకు రెండున్నర గంటల సమయం కేటాయించారు. పీజీటీ, ప్రిన్సిపాల్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు టెట్‌ ఉండదు కనుక వంద మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలుంటాయి. మిగిలిన స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, టీజీటీ పోస్టులకు 80 మార్కులకు, 160 ప్రశ్నలతో పరీక్షలు ఉంటాయి. వీరికి టెట్‌ మార్కుల వెయిటేజీ ఉంటుంది. డీఎస్సీ పరీక్షల్లో మైనస్‌ మార్కులు ఉండవు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12గంటల వరకు, 9.30 నుంచి 12గంటల వరకు... మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు, 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం పరీక్షకు 9గంటలు, మధ్యాహ్నం పరీక్షకు 2గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. 90 నిమిషాల ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎలక్ర్టానిక్‌ వస్తువులతో సహా అభ్యర్థులు ఎలాంటి వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. పెన్నులను మాత్రమే అనుమతిస్తారు. రఫ్‌ వర్క్‌ కోసం పేపర్లు లాంటివి తీసుకురావద్దని, అడిషనల్‌ షీట్లు తామే అందజేస్తామని అధికారులు స్పష్టంచేశారు. హాల్‌ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు కచ్చితంగా ఉండాలి. రోజుకు రెండు సెషన్లలో కలిపి గరిష్ఠంగా 40వేల మంది పరీక్షలు రాసే అవకాశం ఉంది.


154 పరీక్షా కేంద్రాలు: కన్వీనర్‌

మెగా డీఎస్సీకి 154 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాటిలో 137 రాష్ట్రంలో, 17 బయటి రాష్ర్టాల్లో ఉన్నాయన్నారు. 16,347 పోస్టులకు 3,36,305 మంది అభ్యర్థులు... 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారన్నారు. 87.8శాతం మంది అభ్యర్థులకు తొలి ఆప్షన్‌ పెట్టుకున్న జిల్లాలోనే పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ టీవీ నిఘా పర్యవేక్షణ ఉంటుందని, అభ్యర్థులు బయోమెట్రిక్‌ ధ్రువీకరణ చేసుకోవాలని పేర్కొన్నారు. హాల్‌ టికెట్‌, ఫొటో గుర్తింపు కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

45 రోజులు వాయిదా వేయాలి: షర్మిల

డీఎస్సీ నిర్వహణలో అభ్యర్థుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, పరీక్షకు సన్నద్ధం కావడానికి తగినంత సమయం ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. 45 రోజుల్లో సిలబస్‌ మొత్తాన్ని చదవలేమన్న అభ్యర్థుల వినతి మేరకు మరో 45 రోజుల పాటు పరీక్షను వాయిదా వేయాలని మంత్రి లోకేశ్‌ను కోరారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు, పరీక్షకు మధ్య 45 రోజుల వ్యవధి చాలదని, కనీసం 90 రోజులైనా ఉండాలని కోరితే డీఎస్సీని వాయిదా వేయించాలన్న కుట్రగా లోకేశ్‌ పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. గడువు పెంచాలని మొరపెట్టుకున్నా కనికరించరా అని అన్నారు. తమకు మరింత గడువు ఇవ్వాలంటున్న అభ్యర్థుల మొర ఆలకించకపోవడం కూటమి నియంత పోకడలకు నిదర్శనమని షర్మిల వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 06 , 2025 | 03:38 AM