Share News

Junior Hidma Arrest: ఏవోబీలో ఎదురు కాల్పులు

ABN , Publish Date - May 30 , 2025 | 05:00 AM

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని ఓ అడవీ ప్రాంతంలో పోలీసుల‌తో మావోయిస్టులు ఎదుర్కాల్పులు జరిగి, కీలక నేత జూనియర్‌ హిద్మా (మోహన్‌)ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి AK-47 తుపాకీ, 35 రౌండ్ల తూటాలు, 117 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.

Junior Hidma Arrest: ఏవోబీలో ఎదురు కాల్పులు

మావోయిస్టు కీలక నేత జూనియర్‌ హిద్మా అరెస్టు

సీలేరు (అల్లూరి జిల్లా), మే 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత జూనియర్‌ హిద్మాను అరెస్టు చేశారు. పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కోరాపుట్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోరాపుట్‌ జిల్లా బోయిపర్‌గూడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పేటగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఏఎస్పీ పార్థకశ్యప్‌ నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున కొండపై క్యాంప్‌ నిర్వహిస్తున్న మావోయిస్టులు కనిపించగా, ఆ కొండను చుట్టుముట్టారు. మావోయిస్టులు కొండ పైనుంచి కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు గాలిస్తుండగా.. తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు మావోయిస్టుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతడిని మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు కుంజమ్‌ హిద్మా అలియాస్‌ జూనియర్‌ హిద్మా అలియాస్‌ మోహన్‌గా గుర్తించారు. హిద్మా నుంచి ఏకే47 తుపాకీ, 35 రౌండ్ల తూటాలు, 117 ఎలక్ర్టిక్‌, నాన్‌ ఎలక్ర్టిక్‌ డిటొనేటరు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - May 30 , 2025 | 05:02 AM