Share News

Minister Kollu Ravindra: దోపిడీకే మద్యం నగదు లావాదేవీలు

ABN , Publish Date - May 16 , 2025 | 05:08 AM

ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ప్రభుత్వంపై మద్యం నగదు లావాదేవీలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసులో టీడీపీని ఫోకస్ చేస్తూ వైసీపీని దోపిడీ దోషిగా నిలదీసారు.

Minister Kollu Ravindra: దోపిడీకే మద్యం నగదు లావాదేవీలు

  • రూ.99,413 కోట్ల మేర క్యాష్‌ రూపంలోనే..

  • నాడు డిజిటల్‌ చెల్లింపులు ఎందుకు నిలిపేశారు?

  • వైసీపీని నిలదీసిన ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర

  • జగన్‌ పత్రిక అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులు లేకుండా చేసి, రూ.99,413.5 కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా?’ అని ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతల అరాచకాలు నేడు ఒక్కొక్కటిగా సిట్‌ విచారణలో బయటకొస్తుంటే ఓర్వలేని జగన్‌ విషపత్రిక అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వేల కోట్లు దోచుకొని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి.. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను టీడీపీకి ముడిపెట్టాలని వైసీపీ చూడటం సిగ్గుచేటన్నారు. ‘మద్యం కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి.. వీరంతా టీడీపీ నాయకులా..? 2019 వరకు వీరిలో ఎవరికైనా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా?’ అని రవీంద్ర ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి రాగానే వీరు మద్యం వ్యాపారంలోకొచ్చి దోపిడీకి తెరదీశారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వైసీపీ పెద్దలు తమ జేబులు నింపుకొన్నారని అన్నారు. వైసీపీ హయాంలో మద్యం షాపులు తగ్గించినట్లు సిగ్గు లేని రాతలు రాస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 నాటికి 2,934 దుకాణాలు ఉంటే, 2024లో వైసీపీ దిగిపోయే నాటికి 3,396కు పెంచారని పేర్కొన్నారు. 2019-24 మధ్య కేవలం 43 బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని, అవన్నీ వైసీపీ నేతల సొంత బ్రాండ్లేనన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 300 బ్రాండ్లకు ఆర్డర్లు ఇస్తోందని తెలిపారు. ‘2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి మద్యం ఆదాయ విషయంలో తెలంగాణకు, మనకు వ్యత్యాసం రూ.4,186 కోట్లు మాత్రమే. మీరు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఇది రూ.42762 కోట్లకు చేరుకుంది. ఈ ఆదాయం అంతా ఏమైంది’ అని వైసీపీ నేతలను నిలదీశారు.

Updated Date - May 16 , 2025 | 05:11 AM