Share News

LG Investment: రూ.5 వేల కోట్లు 2 వేల ఉద్యోగాలు

ABN , Publish Date - May 07 , 2025 | 04:39 AM

తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్‌జీ 5,001 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌ ద్వారా 2 వేల ఉద్యోగాలు సృష్టించాలని ఎల్‌జీ ప్రకటించింది

LG Investment: రూ.5 వేల కోట్లు 2 వేల ఉద్యోగాలు

  • శ్రీసిటీలో ఏర్పాటు కానున్న ‘ఎల్‌జీ’ యూనిట్‌

  • రేపు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

  • 839 కోట్లతో మరో 5 అనుబంధ యూనిట్లు

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ ప్రసిద్ధ ఎలకా్ట్రనిక్స్‌ సంస్థ ఎల్‌జీ రూ.5,001 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఒక తయారీ యూనిట్‌ను, మరో రూ.839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. వీటికి రాష్ట్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ గురువారం భూమిపూజ చేయనున్నారు. ఎల్‌జీ సంస్థ ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.


రానున్న మూడేళ్లలో వివిధ దశల్లో రూ.5,001 కోట్లతో తమ యూనిట్‌ను స్థాపించనుంది. ఈ యూనిట్‌ ద్వారా 2 వేల ఉద్యోగాలు ఇస్తామని ఎల్‌జీ ఇప్పటికే పేర్కొంది. గత ఏడాది సెప్టెంబరులో జపాన్‌ నుంచి వచ్చిన ఎల్జీ కంపెనీ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్నేహపూర్వక పెట్టుబడి విధానాలపై ఆకర్షితులమయ్యామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. రాయలసీమను ఎలకా్ట్రనిక్స్‌ హబ్‌గా మార్చేందుకు, ఈజ్‌ అఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సను స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సగా అమలు చేస్తున్న విధానాల గురించి మంత్రి లోకేశ్‌ వారికి వివరించారు. దీంతో ఎల్‌జీ సంస్థ మౌలిక సదుపాయాలతో కూడిన సెజ్‌గా ప్రఖ్యాతిగాంచిన శ్రీసిటీలో ఎయిర్‌ కండిషనర్ల తయారీ యూనిట్‌ను స్థాపిస్తామని వెల్లడించింది.

రాష్ట్రానికి తరలివస్తున్న పరిశ్రమలు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులతో 5,00,000 ఉద్యోగాల కల్పన జరిగేలా పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రానికి ఇప్పటికే టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, టాటా పవర్‌, రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్లు వచ్చాయి. రిలయన్స్‌ గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.65,000 కోట్ల విలువైన 500 యూనిట్లు ఏర్పాటు చేయబోతోంది.

సత్యవేడులో లోకేశ్‌ రెండ్రోజుల పర్యటన

సత్యవేడు, మే 6(ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేశ్‌ బుధ, గురువారాల్లో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం ప్రజాదర్బార్‌ నిర్వహించి, అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి 11 గంటలకు శ్రీసిటీకి చేరుకుని, అక్కడ ఎల్‌జీ పరిశ్రమ భూమిపూజలో పాల్గొంటారు.

Updated Date - May 07 , 2025 | 04:39 AM