Kurnool Court: జంట హత్యల కేసులో 11 మందికి జీవిత ఖైదు
ABN , Publish Date - May 09 , 2025 | 04:29 AM
2017లో జరిగిన జంట హత్యల కేసులో కర్నూలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది

కర్నూలు కోర్టు సంచలన తీర్పు
2017లో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య
ఎనిమిదేళ్ల తర్వాత తుది తీర్పు
మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
కర్నూలు లీగల్, మే 8 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్ల క్రితం నాటి జంట హత్యల కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వైసీపీ నాయకుడు, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త కంగాటి లక్ష్మినారాయణరెడ్డి అలియాస్ చెరుకులపాడు నారాయణరెడ్డి, అతడి అనుచరుడు బోయ సాంబశివుడుల జంట హత్యల కేసులో 11 మంది నిందితులపై జీవిత ఖైదు విధించింది. ఈమేరకు కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ న్యాయాధికారి జి.కబర్ధి గురువారం సంచలన తీర్పు చెప్పారు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి ఓ వివాహానికి వెళ్తుండగా.. వెల్దుర్తి మండలం కృష్ణగిరి సమీపంలో కాపు కాసిన నిందితులు రెండు ట్రాక్టర్లలో మారణాయుధాలతో వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక వైపు, ముందు నుంచి ఢీ కొట్టారు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. నిందితులు నారాయణరెడ్డిని బయటకు లాగి కొడవళ్లు, కత్తులతో నరికి, ఆపై నాటు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. అదే కారులో ప్రయాణిస్తున్న అతని అనుచరుడు సాంబశివుడును కూడా నిందితులు మారణాయుధాలతో కిరాతకంగా హత్య చేశారు. నారాయణరెడ్డి కారు డ్రైవర్ గొల్ల కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో 19 మందిపై చార్జ్షీటు దాఖలు చేశారు. వీరిలో ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, వాల్మీకి ఫెడరేషన్ చైర్పర్సన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మలపై ఇటీవల కోర్టు కేసును కొట్టివేసింది. ఇదే కేసులో ఏ4గా ఉన్న కోతుల రామాంజనేయులు కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు.
మిగిలిన 16 మందిపై విచారణ చేపట్టగా తాజాగా ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మిగిలిన 11 మంది నిందితులు కురువ రామాంజనేయులు, రామనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకట్రాముడు, గంటల శ్రీను, బీసన్నగారి రామాంజనేయులు, లక్ష్మన్న కుమారుడు బీసన్నగారి రామాంజనేయులు, బీసన్నగారి పెద్ద బీసన్నలపై నేరం రుజువు కావడంతో వారికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున పీపీ వెంకటరెడ్డి వాదనలు వినిపించారు. కాగా, జంట హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు పడిందని తెలియడంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణ నిందితుల బంధువులు, కుటుంబీకుల రోదనలతో మార్మోగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..
ఆపరేషన్ సిందూర్పై చైనా, అమెరికా స్పందన
For More AP News and Telugu News