Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
ABN , Publish Date - Jul 07 , 2025 | 06:48 PM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

విజయవాడ, జులై 07: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. అనంతరం శ్వాస తీసుకోవడంలో వంశీ ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు వెంటనే ఆయన్ని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తుంది. మరికొద్ది రోజుల పాటు ఆయనకు చికిత్స అందించాల్సి ఉంటుందని వంశీ కుటుంబ సభ్యులకు వైద్యులు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై వైద్యులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వంశీపై 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరయింది. దీంతో 137 రోజుల తర్వాత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. అదీకాక అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలను సుప్రీంకోర్టు విని.. హైకోర్టు తీర్పును సమర్థించింది. ఇక నకిలీ ఇళ్ల పట్టాల కేసులో సైతం వంశీకి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష నగదు, ఇద్దరు వ్యక్తుల షూరిటీతోపాటు వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్కు రావాలంటూ వంశీకి కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కేవలం రూ.100తో భూముల రిజిస్ట్రేషన్..
For More AndhraPradesh News And Telugu News