Collector Lakshmi Sha: రైతు బజార్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు
ABN , Publish Date - Nov 20 , 2025 | 09:21 AM
రైతు బజార్లలో ప్లాస్టిక్ వాడకూడదని.. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ లక్ష్మీ శా కోరారు. పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విజయవాడ, నవంబర్ 20: నగరంలోని పటమట రైతు బజార్ను కలెక్టర్ లక్ష్మీ శా ఈరోజు (గురువారం) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్లో ప్లాస్టిక్ వాడకం, పరిశుభ్రతపై ఎస్టేట్ ఆఫీసర్ రమేష్ను కలెక్టర్ ప్రశ్నించారు. రైతు బజార్లో బాగానే పరిశుభ్రత పాటిస్తున్నారని, ఇంకా బాగా చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం చాలా వరకు తగ్గించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం లక్ష్మీ శా మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా రైతు బజార్లు, మార్కెట్లు తనిఖీ చేస్తున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రత, కూరగాయల నాణ్యత, ధరలను పరిశీలించామని తెలిపారు.
పటమట రైతు బజార్లో శుభ్రతను పాటిస్తున్నారని చెప్పారు. షాపుల్లో రైతులే ఉంటున్నారా, దళారులు ఉంటున్నారా అని చెక్ చేశామన్నారు. డ్వాక్రా మహిళలు ఎక్కడ నుంచి కూరగాయలు తెస్తున్నారనేది పరిశీలించామని అన్నారు. ధరల విషయంలో ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నామన్నారు. పాలిథిన్ కవర్లు వాడకూడదని చెబుతున్నామని.. పూర్తిగా ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలని వెల్లడించారు. రైతు బజార్లలో ప్లాస్టిక్ వాడకూడదని చెప్పామన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు.
పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి షాపు ఎదుట ధరల పట్టిక, కూరగాయల వివరాలు ఉంచాలని ఆదేశించారు. వినియోగదారులు కూరగాయల కోసం రైతు బజార్లకు వస్తారన్నారు. ఇక్కడ నుంచే ప్రజల్లో అవగాహన కలిగించి, ఎకో ఫ్రెండ్లీ రైతు బజార్లుగా మారుస్తామని కలెక్టర్ లక్ష్మీ శా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్తో కొనుగోళ్లు... హాయ్ అంటే ఏఐ సహకారం
లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...
Read Latest AP News And Telugu News