TDP Vs YSRCP Tiruvuru: తిరువూరు ఛైర్మన్ ఎన్నికకు మళ్లీ బ్రేక్
ABN , Publish Date - May 20 , 2025 | 12:53 PM
TDP Vs YSRCP Tiruvuru: తిరువూరు నగర పంచాయతీ ఉపఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్డీవో మాధురి వెల్లడించారు.

ఎన్టీఆర్ జిల్లా, మే 20: తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక (Tiruvuru Nagar Panchayat Chairman Election) మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడం అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో కే.మాధురి ప్రకటించారు. సమావేశానికి మొత్తం 11 మంది కోరం ఉండాల్సి ఉండగా.. కేవలం ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు. దీంతో ఎన్నికను వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్డీవో వెల్లడించారు. ఈరోజు (మంగళవారం) ఉదయం ఎనిమిది మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. తిరువూరు నగర పంచయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సమావేశానికి మొత్తం 11 మంది కోరం ఉంటే సభ నిర్వహణ జరుగుతుంది. కానీ కేవలం ఎనిమిది మంది సభ్యులు మాత్రమే హాజరుకావడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో ప్రకటించారు.
నగర పంచాయతీ ఎన్నికల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తిరువూరు పట్టణంలో గత రెండు రోజులుగా ఈ ఎన్నిక ఉత్కంఠకు దారి తీసింది. ఈ ఎన్నికను ఇటు టీడీపీ, అటు వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నిక జరిగే ప్రాంగణానికి ఎవరినీ అనుమతించలేదు. కేవలం సభ్యులను మాత్రమే అనుమతించారు. ఇక నిన్న(సోమవారం) వైసీపీకి చెందిన ముఖ్య నేతలు ఎన్నిక జరిగే ప్రాంతానికి వచ్చి హడావుడి చేసిన విషయం తెలిసిందే. వారంతా కూడా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధికారులు వారికి తొలగ్గకుండా నిబంధన ప్రకారం ముందుకు వెళ్లారు. పలువురు సభ్యులను రానీయకుండా వైసీపీ అడ్డుకుంటోందని... వారందరిని కూడా వైసీపీకి చెందిన కీలక నేతలు ఎక్కడో తీసుకెళ్లి దాచిపెట్టారని టీడీపీ సభ్యులు చెబుతున్నారు.
కాగా.. తిరువూరు నగర పంచాయతీ 13వ వార్డు కౌన్సిలర్ ఇనపనూరి చిన్నారిని ఐదు రోజులు క్రితం తిరువూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కారులో తీసుకుని వెళ్ళారని చిన్నారి తండ్రి, కొడుకు ఆందోళనకు దిగారు. తమ కూతురిని అప్పచెప్పాలని టీడీపీ నాయకులతో కలిసి నల్లగట్ల స్వామిదాస్ ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామి దాసు ఇంటి ముందు వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి
US: అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు
AP Heavy Rains: అలర్ట్.. ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు
Read Latest AP News And Telugu News