Somireddy Vs Sajjala: సజ్జల నోరెందుకు మూగబోయిందో
ABN , Publish Date - May 06 , 2025 | 01:28 PM
Somireddy Vs Sajjala: నాడు చంద్రబాబు నాయుడు పైనా, నాటి ప్రతిపక్ష పార్టీల ప్రజా పోరాటాలపైనా నీతి మాలిన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి... 64 ఎకరాల అటవీ, ఎసైన్డ్ భూముల కబ్జాపై సమాజానికి సమాధానం చెప్పి తీరాలని సోమిరెడ్డి చంద్రమోహన్ డిమాండ్ చేశారు.

అమరావతి, మే 6: వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణా రెడ్డిపై (YSRCP Leader Sajjala Ramakrishna Reddy) టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (TDP Leader Somireddy Chandramohan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆనాడు అధికారం ఉందని ఎగిరిపడిన తాడేపల్లి క్లర్క్..ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడు అంటూ సజ్జల భూ కబ్జా పర్వంపై ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ బ్లూ మీడియాను పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చిన సజ్జల నోరు నేడు ఎందుకు మూగబోయిందని ప్రశ్నించారు.
నాడు చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)పైనా, నాటి ప్రతిపక్ష పార్టీల ప్రజా పోరాటాలపైనా నీతి మాలిన వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి... 64 ఎకరాల అటవీ, ఎసైన్డ్ భూముల కబ్జాపై సమాజానికి సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అధికారం ఉన్నప్పుడు ఎగిరిపడిన ఆ తాడేపల్లి క్లర్క్.. తప్పులు, నేరాలు,ఘోరాలు చేశాడు కాబట్టే నేడు కలుగులో దాక్కున్నాడని అన్నారు. అటవీ భూమలు మింగేసిన సజ్జలపై కూటమి ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.
Vamsi Remand: వంశీ రిమాండ్పై కోర్టు ఏం తేల్చిందంటే
ఇదీ విషయం
కాగా.. వైఎస్సార్ జిల్లాలో సికే దిన్నె గ్రామంలో 63.72 ఎకరాల భూమిని సజ్జల కుటుంబం కబ్జా చేసిందన్నది వాస్తవమే అని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి కమిటీ రిపోర్టును అందజేసింది. సీకే దిన్నె గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1629లో ఏకంగా 52.40 ఎకరాల అటవీ భూమిని ఎనిమిది చోట్ల ఆక్రమించినట్లు కమిటీ గుర్తించింది. ఇందులో గతంలో పాయవంక రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించి 8.5 ఎకరాల భూమితో పాటు మరికొంత అసైన్డ్ భూమిని కూడా ఉన్నట్లు గుర్తించింది.
ఆక్రమించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఎలాంటి అనుమతులు కూడా లేకుండా వాటిలో ఒక అతిథి గృహం, నాలుగు గదులు నిర్మించినట్లు కమిటీ వెల్లడించింది. అంతేకాకుండా ఆక్రమించిన భూముల్లో సజ్జల కుటుంబ సభ్యులు పండ్ల తోటలు పెంచుతున్నారని, అడవిని ధ్వంస చేసి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించినట్లు కమిటీ తేల్చింది.
ఇవి కూడా చదవండి
Supreme Court Richest Judge: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో సూపర్ రిచ్ ఎవరో తెలుసా
Jupally On Miss World Event: మిస్ వరల్డ్ పోటీలు ఇందుకోసమే అన్న మంత్రి
Read Latest AP News And Telugu News