Machilipatnam: బ్రిటిష్ కాలంలో ఇక్కడి పోర్టు నుంచే సరుకుల రవాణా..
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:54 AM
Masula Beach Festival: మచీలిపట్నం మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మంగళవారం మంత్రి కొల్లు రవీంద్ర 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భైరవం చిత్రం యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో రెండవ పోర్టు బందరు అని అన్నారు.

Krishna Dist: మచిలీపట్నం (Machilipatnam)లో మసులా బీచ్ ఫెస్టివల్ (Masula Beach Festival) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంగళవారం కోనేరు సెంటర్ నుంచి లక్ష్మి టాకీస్ వరకు 2కె రన్ (2K run) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘భైరవం’ చిత్ర హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల (Bhairava movie Unit) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మచిలీపట్నంకు రావడం ఆనందంగా ఉందని, దేశంలో రెండవ పోర్టు బందరు అని, గతంలో వచ్చిన వరదలు వల్ల పోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయని అన్నారు.
సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు..
మళ్ళీ బందరుకు పోర్టు తీసుకువస్తున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచు మనోజ్, నారా రోహిత్, దర్శకుడు విజయ్ కనకమేడల ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం అభివృధి చెందాలంటే టూరిజం కూడా ముఖ్యమని, ఇటువంటి బీచ్ ఫెస్టివల్ వల్ల టూరిజం పెరుగుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. మచిలీపట్నంకు పూర్వ వైభవం చాలా ఉందని, బ్రిటిష్ కాలంలో ఇక్కడి పోర్టు నుంచి సరుకులు రవాణా చేసేవారని అన్నారు. ఈ బీచ్ ఫెస్టివల్లో అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భైరవం సినిమాను విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో రానున్న హరిహర వీరమల్లును కూడా ప్రేక్షకులు సక్సెస్ చేయాలని వారు కోరారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..
2కే రన్ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నం చరిత్రను ఇనుమడింపచేసుకునే విధంగా బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా 2కె రన్ నిర్వహించామని, ఇందులో భైరవం చిత్రం యూనిట్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, పలువురు ఉన్నతాధికారులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారని మంత్రి తెలిపారు.
ఇంకా ఈ బీచ్ ఫెస్టివల్లో బీచ్ వాలీబాల్, హెలికాప్టర్ రైడ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్ట్లు, మామిడి పళ్ల ప్రదర్శన, 100 అడుగుల దోసె వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఈవెంట్ను కృష్ణా జిల్లా అధికారులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ మచిలీపట్నంను టూరిజం హబ్గా మార్చే లక్ష్యంతో జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తుని రైలు దహనం కేసు.. అప్పీల్కు ఏపీ
ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు
For More AP News and Telugu News