Google In AP: ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి
ABN , Publish Date - Jun 07 , 2025 | 09:57 AM
Google In AP: రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ వచ్చేస్తోంది. గూగుల్ సంస్థకు సుమారు 143 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతి, జూన్ 7: ఏపీకి (Andhrapradesh) మరో దిగ్గజ సంస్థ వచ్చేస్తోంది. రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ (Google) రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నతస్థాయిలో గతంలోనే గూగుల్ ప్రతినిధులు చర్చ నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతవరం, నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ-8 రోడ్డు పక్కన సర్వే నంబర్లు 10, 12, 13, 15, 16 లో సుమారు 143 ఎకరాల భూమిని గూగుల్కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థలాన్ని గూగుల్కు కేటాయించేందుకు సీఆర్డీఏ ముందుకు వచ్చింది.
గూగుల్ సంస్థ ప్రారంభించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు అమరావతిలో అంకురార్పణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఆర్డీఏ అధికారులతో కలిసి ఆ సంస్థ ప్రతినిధులు నిన్న (శుక్రవారం) నెక్కల్లులో స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. గూగుల్ సంస్థను ఇక్కడ నెలకొల్పితే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Read Latest AP News And Telugu News