Share News

AP Ration Card: రేషన్‌కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ

ABN , Publish Date - May 22 , 2025 | 02:34 PM

AP Ration Card: 60 వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్ప్రిట్టింగ్ అనేది 44 వేల మంది అడుగుతూ దరఖాస్తు చేశారన్నారు. ఛేంజ్ ఆఫ్ అడ్రెస్ కోసం 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.

AP Ration Card: రేషన్‌కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ
AP Ration Card

విజయవాడ, మే 22: రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. గత రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈకేవైసీ తప్పని సరి అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామన్నారు. దేశంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. 4,24,59,028 మందికి ఈకేవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని తెలిపారు. సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారన్నారు.


ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయని.. 60 వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారని చెప్పారు. స్ప్రిట్టింగ్ అనేది 44 వేల మంది అడుగుతూ దరఖాస్తు చేశారన్నారు. ఛేంజ్ ఆఫ్ అడ్రెస్ కోసం 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అనుసందానం చేశామన్నారు. గత పదిహేను రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమని చెప్పుకొచ్చారు. సర్వర్ డౌన్ కావడం, సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేక పోవడం వంటి వాటితో ఇబ్బంది కలిగిందన్నారు. సాంకేతికపరమైన లోపాల వల్ల ఇబ్బంది కలిగినందుకు ప్రజలకు మంత్రి క్షమాపణ చెప్పారు. మూడు రోజులుగా కమీషనర్, ఇతర అధికారులు ఖాళీ లేకుండా పని చేస్తూ అందరితో మాట్లాడుతూనే ఉన్నారన్నారు. ప్రజలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్పరెన్స్ పెట్టి మరీ అధికారులను ఆదేశించామని తెలిపారు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ.. ప్రజలు తొందరపడవద్దని సూచించారు. రేషన్ దరఖాస్తులకు గడువు లేదని.. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ వైట్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.


అవేమీ అక్కర్లేదు

4,24,59,128 మందికి జూన్ మాసంలో తామే ఉచితంగా రైస్ కార్డులను జారీ చేస్తున్నామన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరూ ఆందోళన చెందవద్దని... మార్పులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. కార్డుదారుల సమాచారం డేటా బేస్‌లో పెట్టి.. ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అందిస్తామన్నారు. రేషన్ తీసుకున్నప్పుడే అప్ గ్రేడ్ అయిపోతుందని... ప్రజలు ఎక్కడకీ వెళ్లకూడదన్నారు. మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదని.. పెళ్లి సంబంధించి ఫోటో కూడా అక్కర్లేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది.. వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాలలో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇస్తున్నట్లు తెలిసిందని.. ఇక అలా చేయొద్దన్నారు. కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే ఎక్కించాలని ఆదేశించారు. ఒక పేరు తొలగించాలంటే.. తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలని స్పష్టం చేశారు. డిలీషన్ అనేది.. డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉంటే.. వారికి కూడా డిలీషన్ ఆప్షన్ ఇస్తున్నామన్నారు.


వాట్స్‌ప ద్వారా కార్డు సరెండర్

మహిళలు, పురుషులతో పాటు, ట్రాన్స్ జండర్స్‌కు కూడా అవకాశం కల్పించామన్నారు. కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వస్తున్న ఫీడ్ బ్యాక్‌ను బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నామన్నారు. రైస్ కార్డు సరెండర్ చేయాలనుకుంటే.. కుటుంబం మొత్తం కలిపి చేయవచ్చని తెలిపారు. కానీ కొంతమంది ఆ కార్డులో వ్యక్తులను మాత్రమే తొలగించాలని చూస్తున్నారని.. అది ఇప్పుడే సాధ్యం కాదన్నారు. వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సర్వర్ సమస్యలతో చాలాసార్లు ఇబ్బందులు పడుతున్నారని.. త్వరలోనే దీనిని సరి చేసి మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈకేవైసీ, ఆధార్ సీడింగ్‌లో మార్పులు, రైస్ కార్డు సరెండర్ చేసుకునే అవకాశాలు వాట్సప్ ద్వారా చేసుకునేలా ఎనెబుల్ చేశామన్నారు. కొత్త రైస్ కార్డులు జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఇస్తున్నామని తెలిపారు. ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా పరిశీలన చేసి, కొత్త కార్డులు ఇస్తామన్నారు. వాట్సప్ ద్వారానే మెరుగైన సేవలు అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.


ఎండీయూ వాహనాలపై

ఎండీయూ వాహనాలపై మంత్రి స్పందిస్తూ.. ఎండీయూ వాహనాలు రద్దు చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం, మైనారిటీ, కార్పోరేషన్ల ద్వారా వాహనాలు వారికే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఉన్నప్పటికీ.. వారికి ఉపాధి ఇచ్చేలా వాహనాలు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఐదు కార్పోరేషన్లకు ఆదేశించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి జీవో వచ్చాక వాహనాలు కూడా లబ్దిదారుల పేర్లతోనే అందిస్తామన్నారు. 90 శాతం మంది ప్రజలు రేషన్ షాపుల ద్వారానే ఇవ్వాలని సర్వేలే రిపోర్టు వచ్చిందన్నారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని తేల్చిచెప్పారు. వృద్దులు, వికలాంగులకు వారి ఇళ్లకు వెళ్లి అందిస్తామన్నారు. గతంలో డోర్ డెలివరీ అన్నారే తప్ప.. ఏ ఒక్కరికీ ఇంటికి వెళ్లి ఇవ్వలేదని అన్నారు. సందు చివర పెట్టి అందరినీ రమ్మంటున్నారని.. ఆరోజు తీసుకోకపోతే వెళ్లిపోయే వారని చెప్పుకొచ్చారు. ఇలా చాలా మంది ప్రజలకు అందక ఇబ్బందులు పడ్డారన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపును బట్టి.. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకు అందించేలా చర్యలు చేపడతామన్నారు. ఎండీయూ వాహనాలను తొలగించడం ద్వారా రేషన్ మాఫియాను అరికట్టామన్నారు. ఇప్పుడు యాప్స్ తయారు చేశామని... డిస్టిబ్యూషన్ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తామన్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తామని, రేషన్ మాఫియాను నివారిస్తామని మంత్రి నాదెండ్ల మనోహన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

కీలక దశకు మిస్‌వరల్డ్‌ పోటీలు

Read latest AP News And Telugu News

Updated Date - May 22 , 2025 | 04:36 PM