AP Cabinet Meeting: ఎవ్వరూ మాట్లాడొద్దు.. లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్
ABN , Publish Date - May 20 , 2025 | 04:25 PM
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశంలో మద్యం కుంభకోణంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ కేసు గురించి మంత్రులు ఎవరూ మాట్లాడవద్దని సీఎం స్పష్టం చేశారు.

అమరావతి, మే 20: ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. ఈరోజు (మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం అంశంపై కేబినెట్లో ప్రస్తావనకు వచ్చింది. మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎవరు మాట్లాడవద్దని.. అనవసరంగా మాట్లాడితే మరో రకంగా వెళ్తుందని మంత్రులకు సీఎం తెలిపారు. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని... వాళ్ళ పని వాళ్ళని చూసుకోనివ్వాలన్నారు. మద్యం కుంభకోణంపై మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుందని... అందుకని దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సూచించారు. మద్యం కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి ఎవరు మాట్లాడవద్దని సీఎం స్పష్టం చేశారు.
వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి అవుతున్న సందర్భంగా సాధించిన విజయాలు, ప్రజలు మనోభావాలపై చర్చిద్దామని సీఎం అన్నారు. పంటలకు ఈ సారి ధరలు తగ్గాయని.. మానిటర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైజాగ్ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడటంపై మంత్రి స్వామిని సీఎం ప్రశ్నించారు. అలా జరగకుండా చూడాలని సీఎం కోరారు. రేషన్ సరఫరాకు ఎండీయూ వాహనాలను కేబినెట్ రద్దు చేసింది. వీటిపై తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లించి వాహనాల యజమానులకు ఇచ్చేయాలని నిర్ణయించింది. బియ్యం ఇచ్చే రోజు మినహా మిగతా రోజుల్లో వాళ్ళే వాడుకుంటున్నారని... ఇకపై రేషన్ బియ్యం రేషన్ దుకాణాల్లోనే ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వికలాంగులు, సీనియర్ సిటిజన్స్కు ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వాహనాల ద్వారా బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని పలువురు మంత్రులు.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ స్థానంలో నగదు ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా కేబినెట్లో చర్చకు వచ్చింది.
పొగాకు రైతుల సమస్యపై
పొగాకు రైతుల సమస్యపై బ్లాక్ బర్లీ పొగాకుపై క్యాబినెట్లో చర్చ జరిగింది. ధరల నిర్ణయక కమిటీలో కొత్తగా మంత్రులు గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడును సీఎం చేర్చారు. ప్రధానితో లోకేష్ భేటీ బాగా జరిగిందని ఈ సందర్భంగా బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. శ్రీశైలంకు రద్దీ బాగా పెరిగిందని... ఆదాయంలో రెండవ స్థానంలో ఉందన్నారు. శ్రీశైలం ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు. అటవీ శాఖ అధికారులతో కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. టెంపుల్ టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలని కేబినెట్ సమావేశంలో సీఎం వెల్లడించారు.
జూన్లోనే తల్లికి వందనం
రెవెన్యూ సమస్యలపై కూడా కేబినెట్లో ప్రస్తావించారు సీఎం. రెవెన్యూ సమస్యలు చాలా పరిష్కారం కావడం లేదన్నారు. ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి అనేది మూడు నెలలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తల్లికి వందనం జూన్ నెలలో ఇవ్వాలని నిర్ణయించారు. స్కూల్ పున:ప్రారంభం అయ్యే రోజుకు ఇచ్చేయాలని స్పష్టం చేశారు. అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మంత్రులను సీఎం ఆసిక్తర ప్రశ్న వేశారు. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాం కదా... వాళ్లింటికి వెళ్ళి మహిళను అడిగి కాఫీ పెట్టి ఇవ్వమని ఎంత మంది మంత్రులు అడిగారని సీఎం ప్రశ్నించగా... మంత్రులు ఎవరు వెళ్లలేదని చెప్పారు. దీంతో జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు తానే వెళ్తున్నానని... మంత్రులు కూడా తప్పనిసరిగా వెళ్లాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పారు. ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజమండ్రిలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్నదాత సుఖీభవను కేంద్ర ప్రభుత్వంతో కలిపి వేద్దామన్నారు. కేంద్రం ఎప్పుడు వేస్తే అప్పుడు వేయాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన ఆదేశాలు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Notice To KCR: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
Vizianagaram Terror Case: పేలుళ్ల కుట్ర కేసు.. వెలుగులో సంచలన విషయాలు
Read Latest AP News And Telugu News