Minister Kolusu Parthasarathi: 3లక్షల గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - May 18 , 2025 | 04:09 AM
రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లను త్వరగా పూర్తిచేసి ఒకేరోజు లబ్ధిదారులకు అప్పగించాలని మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.

హౌసింగ్ అధికారులతో మంత్రి పార్థసారథి సమీక్ష
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. లబ్ధిదారులకు ఆ ఇళ్లను ఒకేరోజు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శనివారం విజయవాడలోని గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సిమెంటు, ఇసుక, స్టీల్ తదితర మెటీరియల్ను ఎప్పటికప్పుడు అందజేస్తూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. లేఅవుట్లలో రహదారులు, డ్రెయిన్లు, మంచినీరు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు కల్పించే పనులను వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.శివప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.