కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ పదవి: కొల్లు
ABN , Publish Date - May 20 , 2025 | 05:21 AM
టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ పదవి వస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్గా సుగుణమ్మ బాధ్యతలు స్వీకరించారు.

ఏపీజీబీసీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ
అమరావతి, విజయవాడ(గాంధీనగర్), మే 19(ఆంధ్రజ్యోతి): టీడీపీలో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ పదవి వస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ ప్రమాణస్వీకార వేడుక గాంధీనగర్లోని ఓ ప్రముఖ హోటల్లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘పొత్తుల్లో భాగంగా పార్టీ తనకు సీటు కేటాయించకపోయినా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గెలుపునకు సుగుణమ్మ ఎంతో కృషి చేశారు. గతంలో ఎమ్మెల్యేగా తిరుపతి ప్రజలకు సేవలందించిన సుగుణమ్మకు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సేవలందించేందుకు అవకాశం వచ్చింది’ అన్నారు. ఈ సందర్భంగా తనకు ఆమె కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. సుగుణమ్మ మాట్లాడుతూ, ‘నాపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతా. రాజధాని అమరావతిని పచ్చదనంతో నింపేందుకు నా వంతు కష్టపడి పనిచేస్తా’ అని అన్నారు. ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని, శ్రావణి, ఎమ్మెల్సీ గ్రీష్మ, ఐలాపురం వెంకయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెను అభినందించారు.