Share News

Jagan Supporters: విషం చిమ్ముదాం

ABN , Publish Date - May 05 , 2025 | 04:53 AM

జగన్‌ అనుకూల ముఠా, ప్రభుత్వంలోని అధికారుల సహాయంతో కీలక సమాచారం సేకరించి, దాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. అమరావతి ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్‌ మీడియా, పత్రికల ద్వారా దాడిని ముమ్మరం చేస్తోంది

Jagan Supporters: విషం చిమ్ముదాం

సర్కారుపై జగన్‌ ‘ముఠా’ వ్యూహం!

  • వారాంతంలో హైదరాబాద్‌లో రహస్య భేటీలు

  • కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్‌ సారథ్యం

  • రిటైర్డ్‌, ప్రస్తుత అధికారులతో మంత్రాంగం

  • ముఠాలో సుమారు పాతికమంది సభ్యులు

  • ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే అజెండా

  • ‘బ్యూరోక్రాట్‌’ తెలివి తేటలన్నీ వాడాలని నిర్ణయం

  • టికెట్‌ ఇస్తామనే హామీతో ఒక అధికారికి వల

  • రాజధాని సమాచారమంతా చేరవేస్తున్న ఆ ఆఫీసర్‌

2014-19మధ్య ఏం జరిగిందో గుర్తుందా? మేధావుల ముసుగులో కొందరు... తటస్థుల అవతారంలో మరికొందరు... సామాజిక వేత్తలమంటూ ఇంకొందరు ఒక పథకం ప్రకారం అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ, విమర్శిస్తూ వచ్చారు. ఈ బృందంలో మాజీ అధికారులూ ఉన్నారు. తెరముందు కనిపించేది వీరు! కానీ... తెరవెనుక ఉండి నడిపించింది మాత్రం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లకు ఈ విష ప్రచారం మొదలైంది. ఇప్పుడు... కూటమి సర్కారు ఏర్పాటై ఏడాదైనా కాకముందే ‘కుట్రల వ్యూహం’ మొదలైంది. జగన్‌ ప్రభుత్వంలో ప్రధానమైన పదవి అనుభవించిన... ఒక అధికారి ఈ దిశగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.

జగన్‌ విపక్షంలో ఉన్నప్పుడు... జగన్‌ సీఎం అయ్యాక ఆయనతో బాగా అంటకాగిన మరో రిటైర్డ్‌ ఐఏఎ్‌సను కూడా ఈ ‘ముఠా’లో కలవాల్సిందిగా ఆహ్వానించారు. ‘సార్‌ కోసం కలిసి పని చేద్దాం! మీరూ వస్తే బాగుంటుంది’ అని ఆయనను పిలిచారు. అయితే... అప్పుడు చేసిన తప్పుల వల్ల తన పేరు ప్రతిష్ఠలన్నీ మంటగలిసిపోయాయని, మళ్లీ అలాంటి పనులు చేయబోనని ఆయన ఒక నమస్కారం పెట్టినట్లు తెలిసింది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు, లేని దురుద్దేశాలు అంటగట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం... విపక్షంలో ఉండగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అజెండా ఇదే! దీనికోసం ‘మేధావులు, తటస్థులు, మాజీ అధికారులు, సామాజిక వేత్తలు’ అనే ముసుగులో తన సొంత సైన్యాన్ని ప్రయోగిస్తారు. 2014-19లో ఇదే చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ప్రభుత్వ విశ్వసనీయతపై విషం చిమ్మేందుకు తెరవెనుక తతంగం మొదలుపెట్టారు. జగన్‌ హయాంలో అడ్డగోలుగా మేళ్లు పొందిన పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర అధికార బృందం ఇందులో క్రియాశీలకంగా ఉంది. వీరిలో కొందరు రిటైర్డ్‌ అధికారులు కాగా... మరికొందరు ఇప్పటికీ సర్వీసులో ఉన్న వారే.


హైదరాబాద్‌ కేంద్రంగా...

కడప జిల్లాకే చెందిన ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌... జగన్‌కు వీర భక్తుడు. ఎందరో సీనియర్లను పక్కనపెట్టి... ఆయనను జగన్‌ ప్రధాన పోస్టులో కూర్చోబెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై దాడి కుట్రల భేటీలకు ఆయనే సారథ్యం వహిస్తున్నారు. గతంలో జగన్‌ ప్రభుత్వంలోని ఇద్దరు అధికారులకు ఒకరంటే మరొకరికి పడేది కాదు. ఇప్పుడు జగన్‌కోసం ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇలా ఇద్దరితో మొదలైన బృందం ఇప్పుడు ఏకంగా పాతికకు చేరినట్లు తెలిసింది. ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న వారు, ఇప్పటికే రిటైర్‌ అయి జగన్‌కోసం తెరవెనక పనిచేస్తున్న వారిని ఆ మాజీ ఐఏఎస్‌ పోగేశారు. ప్రతి వారాంతంలో హైటెక్‌ సిటీ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌ రాయదుర్గంలోని ఓ ప్రముఖ అపార్ట్‌మెంట్‌ల సముదాయంలో వీరు భేటీ అయ్యేవారు. లిక్కర్‌, ఇసుక, సోషల్‌ మీడియా కేసుల్లో పలువురిని ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ ప్రాంతం లో పోలీసుల నిఘా పెరగడంతో వేదిక మార్చేశారు. హైటెక్‌సిటీ ప్రాంతంలో ఓ ఫ్లాటు తీసుకొని అందులో భేటీ అవుతున్నారు.


అంతా పకడ్బందీగా...

‘విష కూటమి’ సభలు అత్యంత పకడ్బందీగా జరుగుతున్నాయి. అందుకు హాజరయ్యేవారెవరూ సెల్‌ఫోన్‌లు, ఇతర కమ్యూనికేషన్‌ పరికరాలు తీసుకెళ్లకూడదని షరతు విధించారు. అలాగే... సొంత కార్లలో రావొద్దు. రిటైరైన వారిని, సర్వీసులో ఉన్న వారిని జగన్‌ ప్రేరేపిత సైన్యం తమ వాహనాల్లోనే ‘పికప్‌ అండ్‌ డ్రాప్‌’ ఉంటుంది. ఫోన్లు తెచ్చుకుంటే ట్రాక్‌ చేస్తారని... సొంత వాహనాల్లో వస్తే ఎవరైనా గుర్తిస్తారనే ఈ జాగ్రత్తలు. ఈ భేటీ అజెండా ఒక్కటే! కూటమి సర్కారు విశ్వసనీయతను దెబ్బతీయడం ఎలా? అనే అంశంపైనే చర్చ! ముఖ్యమంత్రి చంద్రబాబును అంత సులువుగా వేలెత్తి చూపలేరు! ఆ అవకాశమూ ఆయన ఇవ్వరు. దీంతో... చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్‌ను మరో ప్రధాన టార్గెట్‌గా చేసుకున్నారు. లోకేశ్‌ చూసే శాఖలు, అందులోని అంశాలను ప్రధానంగా ఎత్తిచూపాలన్నది వారి లక్ష్యం. లోపాలుంటే బయటపెట్టవచ్చు. వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమే. కానీ.. ఈ ముఠా ఉద్దేశం అదికాదు. అసత్యాలు, తప్పుడు గణాంకాలతో వండివార్చిన డేటా ఆధారం గా ఆరోపణలు, విమర్శలు చేయించడం, లేని అక్రమాలు జరుగుతున్నట్లుగా జగన్‌ సొంత మీడియా, వారి కూలి మీడియాలో ప్రచారం చేయించడం, ఆ తర్వాత వాటిని వైసీపీ సోషల్‌ మీడియాలో మరింత పబ్లిసిటీ కల్పించడం ఈ బృందం కార్యాచరణ!


అప్పుడూ ఇదే వ్యూహం...

2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం... అప్పట్లో వైసీపీ చేసిన విష ప్రచారమే! ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే... అంటే, 2017జూన్‌ నుంచే అఖిల భారత సర్వీసు అధికారులు, దిగువ, మధ్యశ్రేణి అధికారుల్లో ‘జగన్‌ టీమ్‌’లు ఏర్పడి పనిచేశాయి. వైసీపీ నేతలు ఒక తప్పుడు రాజకీయ ఆరోపణ చేయడం... అది నిజమని నమ్మించేందుకు తటస్థ ముసుగులోని వ్యక్తులు పదేపదే అదే అబద్ధం చెప్పడం... ఉద్యోగులు, సామాన్య ప్రజలను తప్పుదారి పట్టించడం! ఇలా ఒక పద్ధతి ప్రకారం విష ప్రచారం సాగించి... 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు... ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా తిరగకముందే అదే కసరత్తు మొదలుపెట్టారు. పాత వ్యూహాలనే ఆధునీకరించి అమలు చేయాలని భావిస్తున్నారు. కేవలం ఐఏఎ్‌సలనే నమ్ముకుంటే పనికాదని భావించి... మధ్య, దిగువ శ్రేణిలో కొందరు అధికారులను తమవైపు తిప్పుకోవడంపై దృష్టిపెట్టినట్లు తెలిసింది.


ఒక్కొక్కరిపై ఇలా వల...

ప్రభుత్వంలో ఉన్న జగన్‌ అనుకూల అధికారుల ద్వారా కీలక సమాచారాన్ని తెప్పించుకుని... దాన్ని వక్రీకరిచి ప్రజలను తప్పుదారి పట్టించడం ఈ ముఠా వ్యూహం. దీనికోసం ప్రభుత్వంలో ఓ మధ్యశ్రేణి అధికారిని తమ బుట్టలో వేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీ తరఫున అసెంబ్లీ సీటు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆ అధికారి రెచ్చిపోయి, మరికొందరిని తనలాగే మార్చే పనిలో పడ్డారు. ప్రభుత్వ పరిధిలో, ప్రత్యేకించి అమరావతి రాజధాని పరిధిలోని ప్రాజెక్టులు, ఇతర పనుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్‌ ముఠాకు చేరవేస్తున్నాడు. దాని ఆధారంగానే వైసీపీ, జగన్‌ అనుకూల సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలతో కూడిన కంటెంట్‌ను వండుతున్నారు. జగన్‌ రోత పత్రికలోనూ అవే తప్పుడు కథనాలను అచ్చోస్తున్నారు. తాజాగా అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ సభ విజయవంతంపై కూడా అబద్ధాలు, అసత్యాలతో కూడిన దాడిని కొనసాగించారు. జూన్‌ 12కు కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా తమ దాడిని మరింత ముమ్మరం చేసేందుకు ‘ముఠా’ రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Updated Date - May 05 , 2025 | 05:55 AM