Patanjali: హార్సిలీ హిల్స్లో అంతర్జాతీయ వెల్నెస్ సెంటర్ నిర్మిస్తాం
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:13 AM
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్లో అంతర్జాతీయ స్థాయి వైజ్ఞానిక, సాంస్కృతిక స్పిరిచువల్ అండ్ కల్చరల్ వెల్నెస్ సెంటర్ నిర్మిస్తామని పతంజలి వ్యవస్థాపకులు, ప్రఖ్యాత యోగా గురువు బాబా రాందేవ్ తెలిపారు.

విజయనగరం, అల్లూరి జిల్లాలో పతంజలి పెట్టుబడులు
చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు: రాందేవ్ బాబా
బి.కొత్తకోట/కొత్తవలస/అరకులోయ, జూన్ 26(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్లో అంతర్జాతీయ స్థాయి వైజ్ఞానిక, సాంస్కృతిక (స్పిరిచువల్ అండ్ కల్చరల్) వెల్నెస్ సెంటర్ నిర్మిస్తామని పతంజలి వ్యవస్థాపకులు, ప్రఖ్యాత యోగా గురువు బాబా రాందేవ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లి గ్రామంలో పతంజలి సంస్థద్వారా వివిధ రకాల కంపెనీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
గురువారం తన బృందంతో కలిసి ఆయన హార్సిలీహిల్స్, అరకులోయ, చినరావుపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని కొనియాడారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి యోగా వెల్నె్ససెంటర్లను స్థాపించాలన్న ఆయన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన హిల్స్టేషన్ల పరిశీలన నిమిత్తం వచ్చామని తెలిపారు. అదే విధంగా అరకు లాంటి కాలుష్య రహిత ప్రాంతంలో పతంజలి ద్వారా హెల్త్ వెల్నెస్ సెంటర్లు అందుబాటులోకి తేవాలన్న ఆలోచన ఉందన్నారు. చినరావుపల్లి గ్రామంలో పతంజలి సంస్థకు కేటాయించిన 172 ఎకరాల భూములను ఆయన పరిశీలించారు.