Share News

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

ABN , Publish Date - Jun 08 , 2025 | 03:28 AM

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 52.9శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81శాతం మంది మార్కులు మెరుగుపరుచుకున్నారు.

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

  • రేపటి నుంచి రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తులు

అమరావతి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 52.9శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81శాతం మంది మార్కులు మెరుగుపరుచుకున్నారు. సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ ఫలితాలను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా శనివారం విడుదల చేశారు. ఫస్టియర్‌లో జనరల్‌ అభ్యర్థులు 1,27,182 మంది పరీక్షలు రాయగా 57,400 మంది(45శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌ ఒకేషనల్‌ విద్యార్థులు 13,690 మంది పరీక్షలు రాస్తే 6,725 మంది(49శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఫస్టియర్‌లో 46శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌ జనరల్‌ విద్యార్థులు 87,793 మంది పరీక్షలు రాస్తే వారిలో 55,210 మంది(63శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌ ఒకేషనల్‌లో 10,170 మంది పరీక్షలు హాజరైతే 6,777 మంది(67శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా సెకండియర్‌లో 63శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసిన ఫస్టియర్‌ విద్యార్థుల్లో జనరల్‌ కోటాలో 2,30,303 మందికి 1,90,038 మంది(83శాతం) మంది, ఒకేషనల్‌ కోటాలో 5,659 మందికి 1,705 మంది(30శాతం) మార్కులు మెరుగుపరుచుకున్నారు. మొత్తంగా 81శాతం మంది మార్కులు మెరుగుపడ్డాయి. మొత్తంగా రెండేళ్లలో 63శాతం మంది అబ్బాయిలు, 64శాతం మంది అమ్మాయిలు సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు. సాధారణ ఫలితాలు, సప్లిమెంటరీ ఫలితాలు కలిపి చూస్తే ఈ ఏడాది జనరల్‌ విద్యార్థులు ఫస్టియర్‌లో 82.16శాతం మంది, సెకండియర్‌లో 93.35శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత మూడేళ్ల ఫలితాల్లో ఇదే అత్యధికం. సప్లిమెంటరీ ఫలితాలపై విద్యార్థులు ఈనెల 9 నుంచి 13 వరకు రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఒక్కో సబ్జెక్టుకు రీవెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

Updated Date - Jun 08 , 2025 | 03:31 AM