Share News

AP Political Leaders: దేశమే ముందు

ABN , Publish Date - May 11 , 2025 | 04:37 AM

దేశం కోసం పోరాడడం అన్ని మతాల ఐక్యతను చాటుతుంది. ఉగ్రవాదాన్ని అరికట్టే పోరులో ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతు ప్రకటిస్తూ కష్టకాలంలో ఐక్యత అవసరం అన్నారు.

AP Political Leaders: దేశమే ముందు

  • దేశానికి కష్టమొస్తే కలిసి నడవాలి.. ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాదం

  • త్రివిధ దళాలకు మద్దతుగా ఉందాం

  • కాల్పుల విరమణ శుభపరిణామం

  • కేంద్రానికి అండగా ఉంటాం: బాబు

  • కుల మతాల ఐక్యతే బలం: పవన్‌

  • రాజ్‌భవన్‌లో సర్వమత సమావేశం

  • పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం

అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): ‘‘దేశానికి కష్టమొస్తే సంఘటితంగా ఉండటంతోపాటు కలిసికట్టుగా నడవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేశానికి కష్టమొస్తే దేశమే ముందు అనేది అందరి నినాదం కావాలి.’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘ఇంటర్‌ ఫెయిత్‌’(సర్వమత) కార్యక్రమం నిర్వహించారు. ఈ సీందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమని, దేశ అనిశ్చితికి.. ఆర్థిక ఇబ్బందులకు ఉగ్రవాదం, తీవ్రవాదం కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ‘‘పహల్గాం ఉగ్రదాడి కేవలం పర్యాటకులపై జరిగింది కాదు. దేశ శాంతిసుస్థిరతలపై జరిగిన దాడి. కులమతాలకు అతీతంగా ఇలాంటి చర్యలను ఖండించాలి. దేశం కోసం పోరాడి మురళీనాయక్‌ వీరమరణం పొందటం బాధాకరం. మతవిద్వేషాలు లేని రాష్ట్రం మన ఏపీ. అందుకే ఇక్కడ అన్ని మతాల ప్రతినిధులతో కలసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో త్రివిధ దళాలకు మద్దతుగా ఉందాం. ఎట్టకేలకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటన ఈ సమావేశం జరిగే సమయంలో రావడం శుభపరిణామం. కాల్పులు విరమిద్దామని పాకిస్థాన్‌ కోరడంతో భారత్‌ అంగీకరించింది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుజాతి అండగా ఉంటుంది.’’ అని చంద్రబాబు అన్నారు.


  • ఐక్యత చాటుదాం: పవన్‌ కల్యాణ్‌

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. దేశానికి కష్టమొస్తే అందరం ఐక్యంగా ఉంటామని చాటేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ‘‘కష్టకాలంలో అందరూ ఐక్యంగా ఉండటమే మన బలం. ఏదైనా సమస్య వస్తే దేశంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ముందుకొస్తారు. అదే ఈ దేశ గొప్పతనం. ఎదుటివారు దాడి చేస్తే వాటిని ఎదుర్కోనేందుకు యుద్ధం తప్పదు. మన సైన్యానికి మనమంతా అండగా ఉండాలి.’’ అని తెలిపారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘‘ఏ మహిళలను ముష్కరులు కన్నీళ్లు పెట్టించారో అదే మహిళాశక్తిని ప్రపంచానికి చాటేందుకు ఇద్దరు మహిళా అధికారులను ముందుపెట్టి పాకిస్థాన్‌పై పోరు నడిపించడం గర్వించదగ్గ విషయం.’’ అని అన్నారు.

  • త్యాగాలు చిరస్మరణీయం: గవర్నర్‌

అన్ని మతాలవారు కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం చాలా సంతోషకర పరిణామమని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ స్వాగతోపన్యాసం చేశారు. డీజీపీ హరీశ్‌ కుమార్‌గుప్తా.. భద్రతాదళాల సన్నద్ధతను వివరించారు. పాక్‌ కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్‌కు మౌనం పాటించి నివాళులర్పించారు.

  • జాతీయ రక్షణ నిధికి అయ్యన్న విరాళం

  • నెల జీతం రూ.2.17లక్షలు అందజేసిన స్పీకర్‌

జాతీయ రక్షణ నిధికి తన నెల వేతనం రూ.2.17లక్షలను విరాళంగా(ఆన్‌లైన్‌లో) అందజేసినట్టు ఏపీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్ల సంక్షేమానికి తన వంతు సాయంగా అందజేసినట్లు చెప్పారు.ఉగ్రవాద నిర్మూలనకు దేశ సాయుధ దళాలు చేస్తున్న పోరాటం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తిని రగిలిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 11 , 2025 | 05:59 AM