Visakhapatnam: నేవీ గూఢచర్యం కేసు.. భార్యాభర్తలకు ఐదున్నరేళ్ల జైలు
ABN , Publish Date - Feb 25 , 2025 | 06:33 AM
నేవీ గూఢచర్యం కేసులో భార్యాభర్తలకు ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): నేవీ గూఢచర్యం కేసులో భార్యాభర్తలకు ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. రూ.5 వేలు జరిమానా కూడా విధిస్తూ.. చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలులో ఉండాలని స్పష్టం చేసింది. భారత నౌకాదళానికి చెందిన రహస్యాలను పాకిస్థాన్కు చేరవేయడంలో అబ్దుల్ రెహమాన్, షాయిస్తా క్వైజర్ అనే భార్యాభర్తలు కీలకపాత్ర పోషించారని ఎన్ఐఏ అభియోగం మోపింది. ఈ కేసులో 2019 డిసెంబరు, 2020 జూన్ మధ్య 15 మందిని అరెస్టు చేయగా, అందులో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. వీరిపై చార్జిషీట్ నమోదైంది. విదేశీ ఇంటెలిజెన్స్కు ఏజెంట్లుగా వ్యవహరించారని, పాక్లో ఉన్న బంధువుల ద్వారా అక్కడి ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకున్నారని పేర్కొంది. 2018 ఆగస్టు 14, సెప్టెంబరు 1 తేదీల్లో పాకిస్థాన్ వెళ్లారని, అక్కడి ఏజెంట్ల ఆదేశం ప్రకారం ఆన్లైన్ ద్వారా డబ్బులను వివిధ ఖాతాలకు పంపించారని వెల్లడించింది. వారంతా భారత నౌకాదళ రహస్య సమాచారం చేరవేసినవారు కావడంతో ఈ భార్యాభర్తలకు కోర్టు శిక్ష విధించింది.