High Court: బెయిల్ అర్హత మీకు లేదు
ABN , Publish Date - May 08 , 2025 | 04:04 AM
మద్యం స్కాంలో ప్రధాన నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్పల ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు తిరస్కరించింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొంటూ కస్టడీలో విచారణకు వీలుగా తీర్పునిచ్చింది.

మద్యం స్కాంలో జగన్ బ్యాచ్కు హైకోర్టు షాక్
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి,
గోవిందప్పలకు ముందస్తు బెయిల్ నో
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయా ంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్కు హైకోర్టు షాకిచ్చింది. ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న మాజీ సీఎం జగన్ అప్పటి కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలు ముందస్తు బెయిల్ పొందేందుకు అర్హులుకారని తేల్చేసింది. ఈ క్రమంలో వీరు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. దర్యాప్తు ప్రాధమిక దశలో ఉందని పేర్కొంది. రూ.3200 కోట్లు లంచాల రూపంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇంత తీవ్ర ఆరోపణలున్న కేసులో దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పిటిషనర్లపై ఆరోపణలు తీవ్రమైనవని, వారిని దర్యాప్తు అధికారులు ఇంకా విచారించలేదని గుర్తు చేసింది. నేరారోపణలపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు పిటిషనర్లను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరముందని పేర్కొంది. కస్టోడియల్ విచారణకు నిరాకరిస్తే దర్యాప్తు ప్రక్రియలో లోపాలు చోటు చేసుకుంటాయని, తద్వారా దర్యాప్తు సమగ్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం వెల్లడికావాలంటే పిటిషనర్లను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. ‘‘సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే మద్యం పాలసీతో ముడిపడి ఉన్న నేరపూరిత కుట్రలో పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు ప్రాధమికంగా స్పష్టమవుతోంది.
దర్యాప్తులో భాగంగా సీఐడీ సేకరించిన ఆధారాలు, పిటిషనర్లపై ప్రాసిక్యూషన్ పేర్కొన్న తీవ్ర ఆరోపణలను విస్మరించడానికి వీల్లేదు. మద్యం విధానాన్ని తీసుకురావడంలో ఉన్న విస్తృత కుట్రకోణాన్ని వెలికితీసేందుకు దర్యాప్తులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను పిటిషనర్ల ముందు ఉంచి విచారించాల్సిన అవసరం ఉంది. ముందస్తు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది. రొటీన్గా ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదన్నది ఇప్పటికే రూఢీ అయిన న్యాయసూత్రం. అసాధారణ పరిస్ధితులు ఉన్నాయని నమ్మకం కలిగినప్పుడే ముందస్తు బెయిల్ మంజూరుకు కోర్టు జోక్యం చేసుకుంటుంది. ఈ కేసులో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సరైన కారణాలు లేవు. ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్లు అర్హులు కారు.’’ అని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు బుధవారం తీర్పు ఇచ్చారు.
వీరిదే కీలక పాత్ర: సీఐడీ
సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్, మనుశర్మ వాదనలు వినిపించారు. ‘‘వైసీపీ హయాంలో తీసుకొచ్చిన మద్యం పాలసీ రూపకల్పన, లంచాల వసూలు, ఆ సొమ్ము ను షెల్ కంపెనీల ద్వారా మళ్లించడంలో పిటిషనర్లు కీలకపాత్ర పోషించారు. ధనుంజయరెడ్డి కీలకపాత్ర పోషించారు. మద్యం కొనుగోళ్ల ఇండెంట్ను మాన్యువల్ విధానంలోకి తెచ్చారు. లంచాలు ఇచ్చిన డిస్టలరీలకే మద్యం ఆర్డర్లు ఇచ్చారు. ఇవ్వని డిస్టలరీలను బెదిరించి వ్యాపారం నుంచి తప్పుకొనేలా చేశారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పిన డిస్టలరీలకు మాత్రమే మద్యం ఆర్డర్లు ఇచ్చారు. ఇండెంట్లు, అమ్మకాలను ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ పర్యవేక్షించారు.
ప్రభుత్వ పెద్దల సూచనలకు అనుగుణంగా డిపో మేనేజర్లకు వాట్సప్ కాల్ ద్వారా ఏ బ్రాండ్లకు ఎంత ఇండెంట్ పెట్టాలో సూచించారు. దీనికి సంబంధించి సత్యప్రసాద్ స్టేట్మెంట్ ఇచ్చారు. పర్సంటేజ్ల గురించి చర్చించేందుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్ , తాడేపల్లిలో పలుమార్లు భేటీ అయ్యారు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన గోవిందప్ప మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన సోమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారు. ఎవరి ఖాతాల్లోకి సొమ్ము చేరిందనే విషయంలో దర్యాప్తు సాగుతోంది. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, కేసు డైరీలను కోర్టు ముందు ఉంచాం. రూ.3,200 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో తేలింది. నిధులు ఎక్కడకు మళ్లించారనేది తేల్చేందుకు కస్టోడియల్ విచారణ అవసరం. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వీరు పారిపోయే ప్రమాదం ఉంది.’’ అన్నారు.
ఆ పాలసీతో సంబంధం లేదు: పిటిషనర్లు
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వికాస్సింగ్, నాగముత్తు, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ‘‘ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు మద్యం పాలసీతో సంబంధం లేదు. ఇండెంట్లను మాన్యువల్ విధానంలో చేపట్టాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఆధారాలు లేవు.’’ అని తెలిపారు.
రాజ్ కసిరెడ్డి అరెస్ట్లో నిబంధనలు పాటించాం హైకోర్టుకు నివేదించిన ఏజీ
రాజ్ కసిరెడ్డి అరెస్టు విషయంలో సీఐడీ అధికారులు చట్టనిబంధనల మేరకే వ్యవహరించారని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ బుధవారం హైకోర్టుకు నివేదించారు.ఆయనకు ఇచ్చిన అరెస్ట్ మెమోలో స్పష్టంగా మద్యం కేసులో నిందితుడిగా చేర్చినట్లు పేర్కొన్నారని తెలిపారు. రాజ్ కసిరెడ్డిని ఏప్రిల్ 18నే కేసులో నిందితుడి చేర్చామని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింద న్నారు. చట్టనిబంధనలు అనుసరించలేదన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లే దన్నారు. బుధవారం విచారణలో ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి రిమాండ్ విధిస్తూ ఏసీబీ ప్రత్యే క కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్రెడ్డి పిటిషన్ వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆపరేషన్ సింధూర్పై చిరంజీవి ట్వీట్
ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..
For More AP News and Telugu News