Share News

Pamidikalva Madhusudhan: పీఎస్ఆర్‌ పిలిస్తే వచ్చా

ABN , Publish Date - May 26 , 2025 | 03:40 AM

డిజిటల్ మూల్యాంకన కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది. పీఎస్‌ఆర్‌, మధుసూదన్‌ను రెండోరోజూ ప్రశ్నించిన పోలీసులు కీలక వివరాలు సేకరించారు.

Pamidikalva Madhusudhan: పీఎస్ఆర్‌ పిలిస్తే వచ్చా

  • గ్రూపు-1 పేపర్లను ఆయనే అప్పగించారు

  • డిజిటల్‌ మూల్యాంకనం చేయాలని చెప్పారు

  • అంతకుముందు ఆయనతో ఏ పరిచయమూ లేదు

  • పోలీస్‌ విచారణలో మధుసూదన్‌ సమాధానాలు!

  • కొన్ని ప్రశ్నలకు మౌనం దాల్చిన పీఎస్ఆర్‌

  • మరికొన్నింటికి డొంక తిరుగుడు జవాబులు

  • తొలి రోజు 50 ప్రశ్నలు సంధించిన అధికారులు

  • నేడూ కొనసాగనున్న విచారణ

  • రాత్రికి పీఎస్‌లోనే ఇద్దరు నిందితులు

విజయవాడ, మే 25(ఆంధ్రజ్యోతి): ‘పీఎస్ఆర్‌ పేషీ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఒకసారి వచ్చి కలవమని చెప్పారు. వచ్చిన తర్వాత గ్రూపు-1 జవాబు పత్రాలను డిజిటల్‌ మూల్యాంకనం చేయాలంటూ ఈ ప్రాజెక్టును ఆయనే నాకు అప్పగించారు’ అని విచారణాధికారులకు మధుసూదన్‌ జవాబిచ్చారు. ఏపీపీఎస్సీ గ్రూపు-1 పత్రాల డిజిటల్‌ మూల్యాంకనం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు, కామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ పమిడికాల్వ మధుసూదన్‌ను న్యాయస్థానం రెండురోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 6 గంటలకు జైలు నుంచి వారిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నందిగామ డీఎస్పీ ఏబీజీ తిలక్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ లతాకుమారి వారిని విచారించారు. ముందుగా పీఎస్ఆర్‌ను విచారించిన తర్వాత మధుసూదన్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విచారణలో మధుసూదన్‌ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా, పీఎస్ఆర్‌ మాత్రం అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడు జవాబులు చెప్పారని తెలిసింది. పరీక్షా పత్రాల మూల్యాంకనం శాస్ర్తీయ పద్ధతిలో చేయకుండా డిజిటల్‌గా ఎందుకు చేశారని పీఎస్ఆర్‌ను ప్రశ్నించారు.


అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. డిజిటల్‌గా మూల్యాంకనం చేయాలనుకున్నప్పుడు టెండర్‌ ప్రక్రియను ఎందుకు పాటించలేదని ప్రశ్నించగా ఆయన మౌనం వహించారు. డిజిటల్‌ మూల్యాంకనానికి అనుభవం లేని కామ్‌సైన్‌ సంస్థను ఎంపిక చేయడంపై ప్రశ్నించగా, ఆ సంస్థకు అర్హతలు ఉన్నాయని పీఎస్ఆర్‌ చెప్పినట్టు సమాచారం. కామ్‌సైన్‌ సంస్థకు రూ.1.14 కోట్లు చెల్లించేలా చెక్కులపై సంతకాలు చేశారా అని అడిగితే ఆ విషయం గుర్తులేదని జవాబు ఇచ్చారు. ఏపీపీఎస్సీలో కాకుండా హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం ఎందుకు చేశారని ప్రశ్నిస్తే ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేశానని వాదించినట్టు సమాచారం. పీఎస్ఆర్‌కు 25 ప్రశ్నలు, మధుసూదన్‌కు మరో 25 ప్రశ్నలు వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పీఎ్‌సఆర్‌ను గంటపాటు విచారించిన తర్వాత మధుసూదన్‌ను విచారించారు. పీఎ్‌సఆర్‌తో పరిచయం ఎలా ఏర్పడిందని మధుసూదన్‌ను ప్రశ్నించగా, ఆయనతో తనకు ఎలాంటి పరిచయం లేదని, పీఎస్ఆర్‌ పేషీ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చిన తర్వాతే తాను హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆయనను కలిసినట్టు చెప్పారు. సోమవారం వారిని మరికొన్ని ప్రశ్నలు అడగడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, డీజీ స్థాయి అధికారి అయిన పీఎస్ఆర్‌ ఆంజనేయులు ఇప్పటి వరకు పోలీసుస్టేషన్‌లో నిద్రపోయిన దాఖలాలు లేవు. ఒకవేళ ఏదైనా స్టేషన్‌లో తెల్లవార్లూ ఉన్నా అది విధి నిర్వహణలో భాగంగానే ఉన్నారు. ఇప్పుడు తొలిసారిగా ఒక నిందితుడిగా పోలీస్‌ స్టేషన్‌లో గడిపారు. గ్రూపు-1 కేసులో ఆయనతో పాటు మధుసూదన్‌ను కస్టడీకి ఇస్తూ రెండోరోజు విచారణ పూర్తయిన తర్వాత వైద్య పరీక్షలు చేయించి హాజరుపరచాలని కోర్టు స్పష్టం చేసింది. కస్టడీ పూర్తయ్యే వరకు వారిని పోలీసుల వద్దే ఉంచుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో పీఎస్ఆర్‌ రోజంతా స్టేషన్‌లోనే ఉన్నారు.

Updated Date - May 26 , 2025 | 03:45 AM