Tiranga Rallies Held: ఘనంగా తిరంగా ర్యాలీలు
ABN , Publish Date - May 19 , 2025 | 04:28 AM
విశాఖ, నెల్లూరు, ఆత్మకూరులో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారీగా పాల్గొన్న ప్రజలు 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.

భారీ సంఖ్యలో పాల్గొన్న జనం.. మార్మోగిన ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు
విశాఖపట్నం, నెల్లూరు (క్రైం)/ఆత్మకూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్ విజయంతమైన నేపథ్యంలో విశాఖపట్నం, నెల్లూరు, ఆత్మకూరులో ఆదివారం భారీ తిరంగా ర్యాలీలు నిర్వహించారు. యువకులు, విద్యార్థులు, మాజీ సైనికులు, వివిధ వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి ర్యాలీల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు హోరెత్తించారు. విశాఖపట్నంలో బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ నుంచి కాళీమాత గుడి వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పంచకర్ల రమేశ్బాబు, విష్ణు కుమార్రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో వెయ్యి అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి పి.నారాయణ జెండా ఊపి ప్రారంభించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ర్యాలీని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. ఆత్మకూరులో మున్సిపల్ కార్యాలయం నుంచి సత్రం సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. సత్రం సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో 20 మంది మాజీ సైనికులను ఎన్డీఏ కూటమి నేతలు, అధికారులు సన్మానించారు. కోలాటాలు, మహిళలు ప్రదర్శించిన భారీ జాతీయ పతాకం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది.