Jagan Aides Jailed: ముంబై తారలతో బంధమేంటో
ABN , Publish Date - May 19 , 2025 | 04:11 AM
మోనికా బేడీ నకిలీ పాస్పోర్టు వివాదంలో రెవెన్యూ అధికారి కృష్ణమోహన్, జెత్వానీ కేసులో ఐపీఎస్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇద్దరూ బెజవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

నాడు మోనికా బేడీ వివాదంలో కృష్ణమోహన్ రెడ్డి
జెత్వానీ కేసులో పీఎస్ఆర్
ఇప్పుడు ఇద్దరూ బెజవాడ జైల్లో రిమాండ్ ఖైదీలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ గ్యాంగ్ లీలలు అన్నీఇన్నీ కావు! ఆర్థిక వ్యవహారాల్లోనే వారికి బంధాలు, బాంధవ్యాలు ఉన్నాయని అనుకుంటారు కానీ.. కాస్త లోతుల్లోకి వెళితే కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. యాదృశ్చికమే అయినా.. జే బ్యాచ్లోని ఇద్దరు కీలక వ్యక్తుల ‘ఘనత’ ముంబై దాకా చేరింది. సుమారు పాతికేళ్ల క్రితం ఒకరు ఎస్పీగా, మరొకరు ఎమ్మార్వోగా కర్నూలులో పనిచేశారు. ఆ ఇద్దరూ ఇప్పుడు విజయవాడ జైలులో ఒకేబ్యారక్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారే.. జగన్కు కుడిఎడమ భుజాలుగా పనిచేసిన ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ ఓఎస్డీ పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి. వీరి గత ‘చరిత్ర’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... 2001లో దేశాన్నే కుదిపేసిన నటి మోనికా బేడీ నకిలీ పాస్పోర్టు వ్యవహారంలో చాలామంది పేర్లు బయటికి వచ్చాయి. కానీ ఒక్క పేరు మాత్రం తెరమరుగై పోయింది. ఆయనే... కృష్ణమోహన్ రెడ్డి. ఆయన రెవెన్యూ అధికారి అని, జగన్ దగ్గర పనిచేశారనే తెలుసు. మోనికా బేడీ వ్యవహారానికి, ఆయనకూ లింకు ఉందని ఇప్పుడు బయటికి వచ్చింది. 2001లో ఆయన కర్నూలు ఎమ్మార్వోగా పనిచేశారు. అప్పట్లో మాఫియా డాన్ అబూ సలీం, మోనికా బేడీలు దొంగ పేర్లతో పాస్పోర్టు పొందడం వివాదంగా మారింది. అబూ సలీం, మోనికా బేడీ కర్నూలు వాసులుగా దొంగ పేర్లతో సర్టిఫికెట్ తీసుకుని పాస్పోర్టు పొందగలిగారు. మోనికా బేడీ.. సనా మాలిక్ కమల్ పేరుతో, అబూ సలీం.. రమిల్ కమల్ మాలిక్ పేరుతో స్థానికంగా నివాసం ఉంటున్నట్టు 2001 ఏప్రిల్ 9న అప్పటి కర్నూలు ఎమ్మార్వో హోదాలో కృష్ణమోహన్ రెడ్డి నివాస ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీని ఆధారంగా వారు పాస్పోర్టు పొందారు.
అప్పట్లో ఏమి జరిగిందో ఏమో కానీ ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చిన కృష్ణమోహన్ రెడ్డి ప్రాసిక్యూషన్ సాక్షిగా మారిపోయారు. సరిగ్గా అదే సమయంలో కర్నూలు ఎస్పీగా పీఎ్సఆర్ పనిచేశారు. ఫేక్ ఎన్కౌంటర్లు చేశారంటూ ఆయనపై ఎన్హెచ్ఆర్సీలో కేసులు నమోదయ్యాయి. ఆయన కూడా ఎలాగోలా ఆ కేసుల నుంచి బయటపడ్డారు. అప్పట్లో వీరిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ.. ప్రస్తుతం వేర్వేరు కేసుల్లో ఇద్దరూ ఒకే జైలులో ఉన్నారు. అప్పట్లో నకిలీ పాస్పోర్టు వ్యవహారంలో బయటపడ్డ కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు వేల కోట్ల లిక్కర్ కేసులో అరెస్టయి విజయవాడ జైలులో ఉన్నారు. ఇక అప్పట్లో ఎన్కౌంటర్ల కేసులో బయటపడిన పీఎ్సఆర్ ఆంజనేయులు ఇప్పుడు ముంబై నటి కాదంబరి జెత్వానీని అకారణంగా చిత్రహింసలకు గురి చేసిన కేసులో జైలు పాలయ్యారు. ఇలా.. ఇద్దరూ ముంబై నటీమణుల వ్యవహారాల్లో వివాదాస్పదులే. పోలీసు వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.